
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 5 నెలల పాటు జైల్లో ఉన్న కవిత దేశ అత్యున్నత న్యాయస్థానం విధించడంతో జైలు నుండి విడుదల అయ్యింది. బెయిల్ పై కవిత బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. కవితకు గ్రాండ్ వెల్కమ్ పలకడంతో పాటు టపాసులు కాల్చి, మిఠాయి పంచారు గులాబీ కేడర్.
ఈ క్రమంలో కవిత బెయిల్ పై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. గురువారం నల్లగొండ జిల్లా కనగల్లు మండలం చిన్నమాదారంలో 33/11 కేవీ సబ్ స్టేషన్కు కోమటిరెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవిత ప్రజా సమస్యల కోసం కొట్లాడి జైలుకు వెళ్లలేదని.. లిక్కర్ స్కామ్ కేసులో ఆమె జైలుకు వెళ్లిందన్నారు. ప్రజా సమస్యల కోసం కొట్లాడి జైలుకు వెళ్లి .. బెయిల్ వస్తే టపాకులు కాల్చుతారు.
కానీ తప్పు చేసి జైలుకెళ్లి బెయిల్పై బయటకు వస్తే కూడా టపాకులు కాల్చుతారా అని సెటైర్ వేశారు. నిన్న (బుధవారం) బీఆర్ఎస్ నేతలు ఎందుకు ర్యాలీ చేశారో, టపాసులు కాల్చారో నాకు అర్థం కాలేదని ఎద్దేశా చేశారు. ఇక, నల్లగొండ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. రాష్ట్రంలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.