న్యూఢిల్లీ: మంత్రి పదవికి రాజీనామా చేయమని ఇప్పటి వరకు అధిష్టానం తనకు చెప్పలేదని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె బుధవారం (సెప్టెంబర్ 2) ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. సీఎం రేవంత్పై తన కుమార్తె వ్యాఖ్యలు, టీపీసీసీ షోకాజ్ నోటీసులు, క్రమశిక్షణ కమిటీ సిపార్సులు తదితర అంశాలపై ఖర్గేతో ఆమె చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్ చాట్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని తెలిపారు. నా కుమార్తె వ్యాఖ్యల అంశంపై ఖర్గేకు నా వివరణ ఇచ్చానని.. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారని చెప్పారు. ఏసీసీఐ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అపాయిట్మెంట్ లభించలేదన్నారు. అన్ని వ్యవహారాలపై ఇప్పటికే ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా అధిష్టాన ముఖ్యులందరికీ అన్ని విషయాలు రాతపూర్వకంగానూ తెలియజేశానన్నారు.
తన విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వేచిచూస్తున్నానని అన్నారు. రేవంత్ కేబినెట్లో ఉన్న ఇతర సామాజిక వర్గాల మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. మరి వాటన్నిటికీ ఏం సమాధానం చెబుతారు.. ఏం చర్యలు తీసుకుంటారు. చాలామంది రెడ్లు మాట్లాడితే వారి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు. బీసీనైన తనకు ఒక న్యాయం ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయం పాటిస్తారా అని హాట్ కామెంట్ చేశారు.
►ALSO READ | వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన సూపర్ సక్సెస్.. తెలంగాణ హక్కుల విషయంలో ఎక్కడా రాజీపడలేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ గాంధీ చెపుతున్నారు. అలాంటప్పుడు తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనపై ఎందుకు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవద్దన్నారు. నాపై చర్యలు తీసుకుని కంటే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై యాక్షన్ తీసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు తానే సీఎం అని రేవంత్ ఎలా అంటారని నిలదీశారు. ఇదిలా ఉంటే.. కొండా సురేఖ ఎపిసోడ్ పై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
