వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని.. కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో 17 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామని.. సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదల కడుపు నింపుతున్నామని ఆయన గుర్తుచేశారు. 2026, సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు.
మాజీ మంత్రి కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని.. అతని ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఫ్రస్టేషన్తో ఉన్నాడని మంత్రి వివేక్ వెంకటస్వామి చురకలు అంటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని.. కూలిపోయే ప్రాజెక్ట్ను కట్టారని దుయ్యబట్టారు. ఈ విషయంపై మాట్లాడటానికి.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగిన అన్యాయంపై కేటీఆర్ ఎందుకు నోరెత్తటం లేదని మంత్రి ప్రశ్నించారు.
