పేదల మనసు తెలిసిన దేవుడు కేసీఆర్ అన్నారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. KCR అంటే కాలువలు(K) , చెరువులు(C), రిజర్వాయర్లు(R) అని అన్నారు.
అల్మాస్ పూర్ లో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్వయంగా రైతు కాబట్టే రైతుకు అవసరమైన కరెంటు అందిస్తున్నాడన్నారు. ప్రధానమంత్రి మోడీ స్వరాష్ట్రం గుజరాత్ సహా దేశవ్యాప్తంగా ఎక్కడా 24గంటలు కరంటు సరఫరా చేయడం లేదని, ఒక్క తెలంగాణలో కేసీఆర్ దయ వల్ల తెలంగాణలో అది సాధ్యమైందని ఆయన అన్నారు.
అల్మాస్ పూర్ చెరువును నీటితో నింపడమే కాదు కోనసీమకు ధీటుగా తీర్చిదిద్దే బాధ్యత తనదని అన్నారు కేటీఆర్. కులవృత్తి మీద ఆధారపడే వారికి అనేక రకాల పథకాలు అమలు చేస్తున్నామని, రైతులను ధనవంతులుగా తీర్చి దిద్దేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పారు. ఒక్క అల్మాస్ పూర్ చెరువే కాదు జిల్లాలోని అన్ని చెరువులు నింపుతామన్నారు. ఉదయం నుంచి 5 గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు.