మోడీజీ.. అబద్దాలైనా అతికేలా చెప్పడం నేర్పండి : కేటీఆర్

మోడీజీ.. అబద్దాలైనా అతికేలా చెప్పడం నేర్పండి : కేటీఆర్

రాష్ట్రానికి మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర మంత్రుల భిన్న ప్రకటనలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోడీ తన కేబినెట్ మంత్రులకు అబద్దాలైనా అతికేలా చెప్పడం నేర్పించాలని సటైర్ వేశారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలకు సంబంధించి కేంద్ర మంత్రులు తలో మాట చెప్పడాన్ని తప్పుబడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి 9 మెడికల్ కాలేజీలు ఇచ్చేశామని చెబితే.. ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా అసలు తెలంగాణ నుంచి ప్రపోజల్సే రాలేదని చెబుతున్నారని అన్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2 ప్రపోజల్స్ వచ్చాయని అంటున్నారని కేటీఆర్ ట్వీట్ లో రాసుకొచ్చారు. ఈ మేరకు కేంద్ర మంత్రుల ట్వీట్లను దానికి యాడ్ చేశారు.

తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏ జిల్లాలో ఉన్నాయో తెలియదా అంటూ గురువారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. కేంద్రం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు కోరినప్పుడు కరీంనగర్, ఖమ్మంలో  మెడికల్ కాలేజీలు ఉన్నా మళ్లీ అవే జిల్లాల పేర్లు పంపడంతో తిరస్కరించామని చెప్పారు. ఈ క్రమంలో గతంలో వైద్య కళాశాలల విషయంలో  కేంద్ర మంత్రుల కామెంట్లను జోడిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.