ధరలపెంపుతో ప్రజలపై కేంద్రం దొంగ దాడి చేస్తుంది

ధరలపెంపుతో ప్రజలపై కేంద్రం దొంగ దాడి చేస్తుంది

గ్యాస్ సిలిండర్ ధర అడ్డగోలుగా పెంచిన కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోడీ అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో వంట గదుల్లో మంట పుట్టిందని ఆరోపించారు. 8 ఏండ్ల మోడీ పరిపాలనలో సుమారు 170శాతం పెంపుతో ప్రపంచంలోనే అత్యధిక రేటుకు వంట గ్యాస్ అమ్ముతున్న ప్రభుత్వంగా వరల్డ్ రికార్డ్ సృష్టించిందని విమర్శించారు. తాజాగా పెంచిన 50 రూపాయలతో ఈ ఏడాది కాలంలోనే 244 రూపాయల మేర గ్యాస్ బండ రేటును పెంచిన మోడీ పాలనను చూసి అరాచకత్వం కూడా సిగ్గుతో తలదించుకుంటుందన్నారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 410 రూపాయలుగా ఉన్న సిలిండర్ ధర ఇవాళ సుమారు మూడు రెట్లు పెరిగి 1100 రూపాయలు దాటడం దురదృష్టకరమన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1100 రూపాయాలకుపైగా గ్యాస్ రేటు చేరడం బీజేపీ అసమర్థ పరిపాలనకు నిదర్శనమన్నారు. రాయితీకి రాం రాం చెప్పి..సబ్సిడీ ఎత్తేసి దేశ ప్రజలపై మోడీ దొంగ దాడి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 

భరించలేని విధంగా ధరలు పెరుగుతున్నాయ్

నానాటికి రూపాయి విలువ తగ్గిపోతుంటే... మరోవైపు అడ్డూ అదుపు లేకుండా పెట్రో రేట్లు పెరుగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. చుక్కలనంటుతున్న నిత్యావసరాల రేట్లతో ప్రతి కుటుంబానికి బడ్జెట్ భారంగా మారిందన్నారు. బీజేపీ అసమర్థ విధానాలతోనే ప్రజలకు అవసరమైన ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతుందన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజల బాధల్ని పట్టించుకునే సోయి లేదన్నారు. దేశ ప్రజల కష్టాలతో సంబంధం లేకుండా పాలిస్తున్న మోడీ రాజ్యంలో భరించలేని విధంగా ధరలు పెరిగాయన్నారు. కొత్త ఉద్యోగాలు రాక, ఉన్న ఉద్యోగాలు ఊడి ప్రజల ఆదాయాలు పడిపోయాయని తెలిపారు. మోడీ ప్రభుత్వం కనికరం లేకుండా ప్రజల రక్తాన్ని పెరుగుతున్న ధరల పేరుతో పీల్చి పిప్పి చేస్తుందన్నారు. అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ ధర పెంపు పై గొంతు చించుకున్న నరేంద్ర మోడీతో పాటు బిజెపి నాయకులంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలనకు నాయకత్వం వహిస్తున్న మోడీ.. ధరలతో దేశ ప్రజలపై దండయాత్ర చేయడం, పన్నులు పెంచి ప్రజల నడ్డి విరచడాన్నే సుపరిపాలనగా భావిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.  

మహిళలు మళ్లీ కట్టెల పొయ్యి దిక్కు చూస్తున్నరు

గ్యాస్ ధరల పెంపుకి అంతర్జాతీయ కారణాలను చూపించి తమ చేతకానితనాన్ని దాచాలనుకుంటున్న మోడీ ప్రభుత్వ కుటిలనీతిని దేశ ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. ఉజ్వల పథకం పేరుతో తమకు అంటగట్టిన సిలిండర్లను పెరుగుతున్న గ్యాస్ ధరలతో మహిళలు ఉపయోగించడం లేదన్నారు. మళ్లీ కట్టెల పొయ్యి దిక్కు చూస్తున్నారన్నారు.  ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే ధరలను నియంత్రించి దొంగ నాటకాలు ఆడే బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజల పట్ల  సానుభూతితో వ్యవహరించి గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.