- సీఎంను తాగుబోతు అంటే ఒక్కొక్కన్ని గుడ్డలూడదీసి కొడ్తం
- డ్రగ్స్తో నాకేం సంబంధం? ఏ పరీక్షలకైనా సిద్ధం
- సింగరేణి కాలనీ ఘటనపై బాధపడ్డం.. ఆడికిపోయి హడావుడి చేయాల్నా.. న్యాయం జరిగింది కదా?
- ఫాస్ట్ ట్రాక్ కోర్టులకన్నా రాష్ట్రంలో వేగంగా న్యాయం జరుగుతోంది
- ఏడేండ్లలో కేంద్రం ఏం చేసిందో అమిత్ షా ఎందుకు చెప్పలే?
- మీడియాతో మంత్రి చిట్చాట్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వాన్ని తిట్టినా, తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడినా రాజద్రోహం కేసులు పెడతామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తమను వ్యక్తిగతంగా తిడితే అంతకు పదింతలు ఎక్కువగా తిడుతామన్నారు. ఆర్బీఐ, నీతి ఆయోగ్ నివేదికలను కూడా చూడకుండా తెలంగాణను బద్నాం చేసెటోళ్లపై హండ్రెడ్ పర్సెంట్ కేసులు పెడతామని చెప్పారు. సీఎంను తాగుబోతు అంటే ఒక్కొక్కన్ని గుడ్డలూడదీసి కొడుతామని హెచ్చరించారు. శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. తనకు డ్రగ్స్తో ఏం సంబంధం ఉంటుందని, తన రక్తం, వెంట్రుకలు, అవసరమైతే లివర్లో చిన్న ముక్క కూడా టెస్ట్కు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రాహుల్గాంధీ ఈ పరీక్షలకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. తనకు సంబంధం లేని వ్యవహారంపై ఈడీకి కంప్లైంట్ చేశారని మండిపడ్డారు.
‘‘హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో ఏం జరిగింది.. రేప్ జరిగింది.. నాకూ ఆడపిల్ల ఉంది.. ఆ ఘటనపై బాధపడ్డం.. కన్నీళ్లు పెట్టుకున్నం. మేం ఆడికిపోయి హడావుడి చేస్తేనే పనిచేసినట్టా..? న్యాయం జరిగింది కదా. తెలంగాణలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులకన్నా ఫాస్ట్గా న్యాయం జరుగుతుందా.. లేదా.. దిశ కేసులో ప్రభుత్వ చర్యను అందరూ హర్షించలేదా..? ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో ఘోరం జరిగితే అక్కడి ప్రభుత్వం అక్కడికి వెళ్లిందా..?’’ అని ప్రశ్నించారు.
పీసీసీ సీటు కొనుక్కున్నోడు.. టికెట్లు అమ్ముకోడా?
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్కు రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్న రేవంత్ రెడ్డి రేపు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోడా అని కేటీఆర్ అన్నారు. ఈ మాట తాను అనడం లేదని, ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి అన్నారని తెలిపారు. గజ్వేల్లో సభ పెట్టి ఏదో జరిగిపోయినట్టు ఫీల్ అవుతున్నారని, హుజూరాబాద్లో పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవాలన్నారు. ‘‘రేవంత్ రెడ్డిది రియల్ ఎస్టేట్ బాపతు. కమాన్ కట్టి.. దాన్ని చూపెట్టి ప్లాట్లు అమ్ముకున్నట్టు.. అధికారంలోకి రాబోతున్నట్లు ప్రచారం చేసుకుంటూ వ్యాపారవర్గాలను బ్లాక్మెయిల్ చేసి సంపాదిస్తున్నడు” అని ఆరోపించారు. ‘‘ఒకడు సీఎంను తాగుబోతు అంటున్నడు. ముఖ్యమంత్రిని అట్లా తిడితే ఒక్కొక్కన్నీ గుడ్డలూడదీసి కొడ్తం” అని కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ మొదటి నుంచి దొరేనని, ఐదారు వందల ఎకరాల భూములున్న కుటుంబంలో పుట్టారని తెలిపారు. ‘‘సున్నాలేసుకునెటోడు కన్నాలేస్తున్నడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. పేయింట్లేసుకునేటోడికి జూబ్లీహిల్స్లో నాలుగు బిల్డింగులు.. ఆఫీసులు ఎట్లా వచ్చాయో చెప్పాలి? రాజీనామా చేయాలని మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరితే పారిపోయిండు” అని రేవంత్రెడ్డిపై మండిపడ్డారు.
కేసీఆర్ తాగితేనే అమ్మకాలు పెరుగుతున్నయా?
‘‘కేసీఆర్ను తాగుడుకు బ్రాండ్ అంబాసిడర్ అనెటోడు తాగుతలేడా..? కేసీఆర్ ఒక్కరు తాగితేనే రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు పెరుగుతున్నయా.. సీఎంను పట్టుకొని ఎంతపడితే అంత మాట అంటారా.. వాళ్లకన్నా పెద్దోడు అన్న సోయి లేదా..’’ అని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగంలో బాగా పనిచేస్తున్నదని చెప్పిన కేంద్ర మాజీ మంత్రి, ఎంపీని గాడిదా అనెటోడు అడ్డగాడిదనా అని దుయ్యబట్టారు. ‘‘సెన్సేషలిజం కోసం.. ఫసక్ల కోసం.. పవర్ పంచ్ల కోసం మాట్లాడేటోడికి మీడియా ప్రాధాన్యం ఇస్తున్నది. అభివృద్ధి, సంక్షేమం, మంచి పనులను మీడియాలో చూపించడం లేదు. మీడియాకు బాధ్యత లేదా.. నేను కూడా ఆ కొడుకు.. ఈ కొడుకు అని నోటికి వచ్చినట్టు తిడితే అట్లనే పబ్లిష్ చేస్తరా” అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఏడేండ్లలో ఏం చేశారో ఎందుకు చెప్పలే..?
నిర్మల్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏడేండ్లలో తెలంగాణకు ఏం చేశారో ఎందుకు చెప్పలేదని కేటీఆర్ ప్రశ్నించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, తమకు అలాంటి అవసరం లేదన్నారు. ఎంఐఎంకు తామెందుకు భయపడుతామని, బీజేపీనే భయపడుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ పార్టీలది సిల్లీ పాలిటిక్స్ అని దుయ్యబట్టారు.
జానారెడ్డి కన్నా ఈటల పెద్దోడు కాదు
హుజూరాబాద్లో టీఆర్ఎస్ గెలిచి తీరుతుందని కేటీఆర్ అన్నారు. ఎన్నిక ఏదైనా పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేస్తామని చెప్పారు. ‘‘15 ఏండ్లు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి కొత్తగా రాజకీయాల్లో వచ్చిన భగత్ చేతిలో ఓడిపోయారు. అభ్యర్థిని కాకుండా టీఆర్ఎస్ పార్టీని చూసి ప్రజలు ఓట్లేశారు. జానారెడ్డి కన్నా ఈటల రాజేందర్ పెద్దోడు కాదు. బండి సంజయ్కి ఓట్లు వేసి అక్కడి ప్రజలు బాధ పడుతున్నరు. ఇప్పుడు మళ్లీ ఈటల రాజేందర్కు ఓటేసే ప్రసక్తే లేదు” అని ఆయన అన్నారు.
ఇక సహనంగా ఉండటం సాధ్యంకాదు
తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బతీసేలా మాట్లాడే వారి విషయంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వమే తమకు ఇన్స్పిరేషన్ అని, ఆ రాష్ట్రంలో సీఎంను తిట్టినందుకు కేంద్ర మంత్రిని అరెస్ట్ చేశారని కేటీఆర్ అన్నారు. తాము ఏడేండ్లు ఓపిక పట్టామని, ఇక సహనంగా ఉండటం సాధ్యం కాదని చెప్పారు.
అప్పుడు కేసీఆర్ ఉద్వేగంతో అన్నడు.. వీళ్లకేం రోగం పుట్టింది
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎవరిని తిట్టినా అవి ఉద్వేగంతో అన్న మాటలే. ఇయ్యాళ వీళ్లకేం రోగం పుట్టింది. వీళ్లకన్నా వయసులో పెద్ద వ్యక్తి, ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతరా?” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు అస్తిత్వమే లేనప్పుడు విలీన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరామని చెప్పారు. ‘‘ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన జూన్ రెండో తేదీనే తెలంగాణకు అసలైన విమోచన దినం. అలాంటప్పుడు విమోచన దినంపై చర్చ అవసరం లేదు. ప్రభుత్వం స్టాండ్ను సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే ఆన్ రికార్డు చెప్పారు” అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీగా విలీన దినాన్ని తాము జరుపుకున్నామని, తమ పార్టీ పార్లమెంటరీ నేత కె. కేశవరావు జెండా ఎగురవేశారని కేటీఆర్ చెప్పారు.
కేసీఆర్నే ప్రవీణ్కుమార్, షర్మిల ఎందుకు తిడుతున్నరు?
తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీనే లైఫ్ లైన్ అని కేటీఆర్ అన్నారు. కొత్తగా బీఎస్పీలో చేరిన ప్రవీణ్ కుమార్, పార్టీ పెట్టిన షర్మిల కేసీఆర్నే ఎందుకు తిడుతున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. వీరు ఏదో ఒక జాతీయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు, ఐఐఎం ఇవ్వని బీజేపీపై ఎందుకు విమర్శలు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. టీఆర్ఎస్ ఓట్లను చీల్చి.. రాష్ట్రాన్ని ఫెయిల్యూర్గా చూపెట్టడానికి ఈ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
నెలాఖరు నాటికి సిటీ కమిటీలు: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: ఈ నెలాఖరులోగా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీలను వేయాలని నేతలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. శనివారం తెలంగాణ భవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. బస్తీ, కాలనీ, డివిజన్ కమిటీలపై చర్చించారు. పార్టీ కోసం పనిచేసే వారికే కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.