కార్మికశాఖ పద్దులపై చర్చకు సమాధానమిస్తూ… ఆ శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కొంత సహనం కోల్పోయారు. ఓ సందర్భంలో ఆయన్ను మంత్రి కేటీఆర్ నవ్వుతూ వారించాల్సిన సందర్భం ఎదురైంది. ఐదేళ్లలో రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి మార్గంలో నడిపారని.. దుబాయ్ దివాలా తీస్తే.. హైదరాబాద్ నగరం మాత్రం అభివృద్ధిలో టాప్ లో ఉందనీ చెప్పారు. గడిచిన మూడేళ్ళలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని చెప్పారు.
‘28 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో ఎవరూ పింఛన్లు ఇవ్వలేదు.. పథకాలు రచించలేదు.. ప్రాజెక్టులు కట్టలేదు.. దేశంలోనే తన పాలనతో చరిత్ర సృష్టించిన ఘనత కేసీఆర్ ది. మూడేళ్లలోనే కాళేశ్వరాన్ని కట్టారు’ అన్నారు మల్లారెడ్డి. ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం చెప్పడంతో… ‘ కార్మికులతోనే కట్టారయ్యా… కాళేశ్వరం ప్రాజెక్టు.. మూడేళ్లలో కార్మికులు కట్టారు కాబట్టే కంప్లీట్ అయ్యింది అది..’ అని మల్లారెడ్డి సహనం కోల్పోయి.. ఆవేశంగా చెప్పారు.
అదే సందర్భంలో మంత్రి కేటీఆర్ నవ్వుతూ… మంత్రి మల్లారెడ్డికి సర్ది చెప్పారు. సమాధానం కొనసాగించండి అన్నట్టుగా సైగ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా.. మంత్రిని కొనసాగించాలంటూ కోరడంతో మల్లారెడ్డి తన స్పీచ్ కంటిన్యూ చేశారు.
28 రాష్ట్రాల్లో 28 ముఖ్యమంత్రుల్లో ఎవరూ కేసీఆర్ అంత ప్రగతి చూపించలేదని గుండెలు బాదుకుంటూ చెప్పారు మంత్రి మల్లారెడ్డి.
దుబాయ్ దివాలా తీసింది… హైదరాబాద్ టాప్ లో ఉంది..
హైదరాబాద్ లో ఉన్నన్ని ఉపాధి అవకాశాలు మరే రాష్ట్రంలోనూ లేవన్నారు మంత్రి మల్లారెడ్డి. ఇతర దేశాలు, రాష్ట్రాలనుంచి ఉద్యోగాల కోసం హైదరాబాద్ వస్తున్నారని అన్నారు. దుబాయ్ లాంటి దేశం దివాలా తీసిందని.. హైదరాబాదే టాప్ లెవెల్లో నడుస్తోందని చెప్పారు.
పేరుకే కార్మిక శాఖ.. మాది ధనిక శాఖ
కార్మికుల సమస్యలు పూర్తిగా తెలిసిన సీఎం కేసీఆర్ అన్నింటినీ పరిష్కరిస్తున్నారని చెప్పారు. పేరుకు కార్మిక శాఖ కానీ, ఇది ధనిక శాఖ అనీ.. 1600 కోట్ల FDలు ఉన్నాయన్నారు మల్లారెడ్డి.