సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి ఏసీబీ అధికారలకు అడ్డంగా బుక్కయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒక బాధితుడికి సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ తగ్గించేందుకు, మున్సిపల్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న నిఖిల్ రెడ్డి రూ. 35 వేల లంచం డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా ఇప్పటికే బాధితుడి నుంచి 20 వేల రూపాయలు వసూలు చేశాడు.
ALSO READ : జనాభా లెక్కలు తేలాలి.. దళితులు ఎదగాలి
అయినప్పటికీ మిగిలిన నగదు కోసం నిఖిల్ రెడ్డి బాధితుడిపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 30న మున్సిపల్ కార్యాలయంలో బాధితుడి నుంచి మిగిలిన 15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు నిఖిల్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
సుమారు 4 గంటల పాటు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిఖిల్ రెడ్డిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వెల్లడించారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

