- అనుమానాస్పదంగా ఉన్న భూముల లాగిన్స్ డిలీట్ చేశారని వెల్లడి
- కొల్లగొట్టిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను వసూలు చేస్తామని వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: తీగ లాగితే డొంక కదిలినట్లుగా ధరణి పోర్టల్ వ్యవహారం ఉన్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. ప్రజల ఆస్తుల రక్షణకోసం ఏర్పాటు చేసిన వ్యవస్థను.. ఆనాటి ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని తెలిపారు. ధరణి పోర్టల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కొల్లగొట్టిన సంఘటనపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించగా దిగ్భ్రాంతికరమైన అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు.
ఇది సాధారణ సాంకేతిక లోపం కాదని.. వ్యవస్థాగతంగా సృష్టించిన లోపాల ఫలితమని తెలిపారు. బుధవారం సెక్రటేరియెట్లోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి కమిటీతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు ధరణి పోర్టల్ సెక్యూరిటీ ఆడిట్ చేసిన సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దకుండానే అంతా సవ్యంగానే ఉన్నట్లుగా నివేదిక ఇచ్చారన్నారు.
మానవ ప్రమేయంతో తప్పులు చేసేలా పోర్టల్ను రూపొందించారని , భూముల లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న భూముల సమాచారం లభించకుండా లాగిన్స్ డిలీట్ చేశారన్నారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన లాగిన్ వివరాలు లేకుండా పోయాయని ఉన్నతస్థాయి కమిటీ విచారణలో ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన భూలావాదేవీల సమాచారం లభించకుండా చేశారని , ఫోరెన్సిక్ ఆడిట్లో కోడ్ ఆడిట్ నిర్వహించలేదన్న విషయం బహిర్గతమైందన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే ధరణి పోర్టల్పై కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను టెర్రాసిస్ అనే విదేశీ సంస్థకు అప్పగించడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించినట్టు తెలిపారు.
ఎవరినీ వదిలిపెట్టం
ధరణి లోపాలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను కొల్లగొట్టిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. తప్పుచేసినవారు ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతిపైసాను వసూలు చేస్తామని చెప్పారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొని.. భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా.. ఏ చిన్న లోపానికి తావులేకుండా.. అధికారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా.. ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండేలా భూ భారతి పోర్టల్ను నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ప్రజల భూముల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, ధరణి పేరుతో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికితీస్తామన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన విధంగానే మిగిలిన జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేశ్ కుమార్, సీసీఎల్ఏ సీఎంఆర్వో మందా మకరంద్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంత్, ఉన్నతస్థాయి కమిటీ సభ్యులు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ సుభాష్, ఎస్బీ ఎస్పీ సింధుశర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
