హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ తో నేరుగా కుమ్మక్కయ్యారని, బీజేపీ వ్యవస్థను 'బీఆర్ఎస్2'గా మార్చేసి వారికి హ్యాండోవర్ చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి ప్రచారసరళి 'దింపుడు గల్లెంలా ఉందని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి 10 వేల ఓట్ల కంటే ఎక్కువ రావని సవాల్ విసిరారు. 'గత ఎన్నికల్లో మీరు బీఆర్ఎస్ మద్దతు తీసుకు న్నరు. ఇప్పుడు దానికి గురుభక్తిగా ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు లోపాయికారీగా మద్దతు తెలుపుతున్నారని జూబ్లీహిల్స్లో బహిరంగంగా చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రిగా, సికింద్రాబాద్ ఎంపీగా పదేండ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంటు ఏం చేశారో చెప్పగలరా? ఇప్పటికైనా కిషన్ రెడ్డి నిజాయతీగా వ్యవహరించాలి. సొంత పార్టీ అభ్యర్థిని మోసం చేయకుండా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెబుతున్నట్టుగా నిబద్ధతతో పని చేయాలని డిమాండ్ చేస్తున్నాను' అంటూ పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.
