మొక్కలు నాటకుంటే ఆక్సిజన్​ కొనాల్సిందే: మంత్రి పొన్నం ప్రభాకర్

మొక్కలు నాటకుంటే ఆక్సిజన్​ కొనాల్సిందే: మంత్రి పొన్నం ప్రభాకర్

మెహిదీపట్నం, వెలుగు: ఇప్పుడు మొక్కలు నాటకుంటే భవిష్యత్తు తరాల వారు ఆక్సిజన్​ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన గెస్ట్​గా హాజరయ్యారు. గోల్కొండ ఏరియా హాస్పిటల్ ఆవరణలో జహీరాబాద్ ఎంపీ సురేశ్​ షెట్కార్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మొక్కలు నాటారు. 

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ హైదరాబాద్​ మరో ఢిల్లీగా మారకుండా జాగ్రత్త పడాలన్నారు. తర్వాత కలెక్టర్​ అనుదీప్​, ఎమ్మెల్యే మొహినుద్దీన్​ గోల్కొండ ఏరియా దవాఖానలో  వార్డులను సందర్శించారు. డీసీహెచ్​ఎస్​ డాక్టర్​ సూర్యకుమారి, ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్​ శ్రీనివాస్​రావు తదితరులు పాల్గొన్నారు.