
మెహిదీపట్నం, వెలుగు: ఇప్పుడు మొక్కలు నాటకుంటే భవిష్యత్తు తరాల వారు ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన గెస్ట్గా హాజరయ్యారు. గోల్కొండ ఏరియా హాస్పిటల్ ఆవరణలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ హైదరాబాద్ మరో ఢిల్లీగా మారకుండా జాగ్రత్త పడాలన్నారు. తర్వాత కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే మొహినుద్దీన్ గోల్కొండ ఏరియా దవాఖానలో వార్డులను సందర్శించారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ సూర్యకుమారి, ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.