ట్యాంక్ బండ్/ వికారాబాద్ / చార్మినార్ ,వెలుగు: దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రశ్నిస్తున్నందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం ట్యాంక్బండ్అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ సలహాదారు వీహెచ్, ఉద్యమకారుల గుర్తింపు కమిటీ మెంబర్ మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్, ఖైరతాబాద్డీసీసీ అధ్యక్షుడు రోహిత్, అరవింద్ కుమార్ యాదవ్, నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించిన వేదికను శుద్ధి చేయడం ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానమన్నారు. ఈ ఘటనకు బీజేపీ బాధ్యత వహించి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై కక్షతోనే బీజేపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందని వికారాబాద్ డీసీసీ ప్రెసిడెంట్జాదవ్ ధారాసింగ్ నాయక్ ఆరోపించారు.
జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీ తీశారు. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో శుద్ధి ఘటనకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు సంతోష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సంతోష, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే, హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా ఆధ్వర్యంలో నాయకులు లాల్ దర్వాజా మోడ్ వద్ద నిరసన తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
