హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి షిఫ్ట్ బస్సులకు మంచి ఆదరణ వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 1 నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు ప్రధాన రూట్లలో రాత్రి పూట ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చామని, మొత్తం 70 ట్రిప్పుల్లో 9,286 మంది ప్రయాణించారని వివరించారు.
సిటీలోని మరికొన్ని రూట్లలో రాత్రి పూట బస్సులు నడుపాలనే డిమాండ్లు వస్తున్నాయని, వాటిని పరిశీలించి మరిన్ని రూట్లలో నైట్ షిఫ్ట్ బస్సులను నడుపుతామని తెలిపారు. హైదరాబాద్ సిటీలో 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు ప్రజలకు అందుబాటులో ఉండేలా దశల వారీగా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
