ఎవరిని ఎంక్వైరీకి పిలవాలనేది కమిషన్ ​ఇష్టం: పొన్నం ప్రభాకర్

ఎవరిని ఎంక్వైరీకి పిలవాలనేది కమిషన్ ​ఇష్టం: పొన్నం ప్రభాకర్
  •     వాళ్ల ఇంట్లో పంచాయితీ మాకవసరం లేదని వ్యాఖ్య
  •     గాంధీ భవన్​లో మంత్రుల ముఖాముఖి ప్రోగ్రాం.. 
  •     పాల్గొన్న పొన్నం, పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్

హైదరాబాద్, వెలుగు:రాజకీయ ఉనికి కోసం ఎమ్మెల్సీ కవిత పోరాటమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీడియాలో ఉండటం కోసమే లేఖలు రాసి లీక్ లు చేయిస్తున్నారని ఆయన తెలిపారు. బుధవారం గాంధీ భవన్ లో మంత్రుల ముఖాముఖి పోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ నుంచి 100కి పైగా వినతి పత్రాలు స్వీకరించారు. ప్రధానంగా భూ పంచాయతీలు, ఇందిరమ్మ ఇండ్లు, నగరంలో డబుల్ బెడ్ రూంలు, భూ కబ్జాలు, రేషన్ కార్డులు, ఉచిత కరెంట్ బిల్లులు, సంక్షేమ పథకాలు తదితర సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతులు వచ్చాయి. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. 

కవిత అంశం టీ కప్పులో తుఫాను లాంటిదని.. కేటీఆర్, కవిత పంచాయితీ కాంగ్రెస్ కు అవసరం లేదన్నారు. కాళేశ్వరం కమిషన్ అంశంలో ఎవరిని విచారణకు పిలవాలన్నది కమిషన్ ఇష్టమన్నారు. సాగు నీళ్లు ఇస్తే సంతోషమే.. కానీ ప్రాజెక్టుల పేరు చెప్పి నీళ్లలా తెలంగాణ ధనాన్ని దుర్వినియోగం చేశారని, దోచుకున్నారని ఆయన మండిపడ్డారు.  ఉనికి కోసం బీఆర్ ఎస్ డ్రామాలు అని, రాజకీయంగా దృష్టి మళ్లించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పిల్లి శాపనార్థాలు పెట్టడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు లో కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. పార్టీకి గాంధీ భవన్ దేవాలయం లాంటిదని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన దేవాలయంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు గాంధీ భవన్ కి వచ్చి సమస్యలు చెప్పుకోవాలని మంత్రి కోరారు.