శామీర్ పేట వెలుగు : రైతు సమస్యల పరిష్కారానికి రైతు నేస్తంను ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం 119 నియోజకవర్గాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించింది. మూడు చింతలపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కు మంత్రి పొన్నం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటిక మార్చేందుకు..
వ్యవసాయ శాస్త్రవేత్తలు,అధికారులతో క్షేత్రస్థాయిలోని సమస్యలపై రైతులతో నేరుగా చర్చించేందుకు డిజిటల్ ప్లాట్ ఫామ్ రైతు నేస్తం ఉపయోగపడుతుందన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణ అధికారులు, రైతులతో కార్యక్రమం ఉంటుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ ఇన్ చార్జ్ తోటకూర వజ్రేశ్ యాదవ్, మూడు చింతలపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహులు యాదవ్, వైస్ ఎంపీపీ మంద శ్రీనివాసరెడ్డి, మధుకర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు, రైతులు పాల్గొన్నారు.