కాంగ్రెస్​ పాలనలో బంజారాలకు చేసిందేమీ లేదు : సత్యవతి రాథోడ్

కాంగ్రెస్​ పాలనలో బంజారాలకు చేసిందేమీ లేదు : సత్యవతి రాథోడ్

ములుగు, వెలుగు : కాంగ్రెస్​ పాలనలో బంజారాలకు చేసిందేమీలేదని, బీఆర్​ఎస్​ పాలనలో తండాలను జీపీలుగా చేసిన నేత సీఎం కేసీఆర్​ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ అన్నారు. శనివారం ములుగులోని లీలా గార్డెన్​ లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ పోరిక గోవింద్​ నాయక్​ ఆధ్వర్యంలో నిర్వహించిన బంజారా ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్​ పర్సన్​, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి కలిసి ఆమె మాట్లాడారు. 60 ఏళ్ల కాంగ్రెస్​ పాలనలో లంబాడా జాతికి ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు.

నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచిన పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్వయంపాలన దిశగా అడుగులు పడ్డాయన్నారు. పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని చెప్పారు. ఎంపీ కవిత మాట్లాడుతూ ప్రజల కోసం ప్రాణాలు ఒదిలిన మావోయిస్టు నేత బిడ్డ అయిన నాగజ్యోతిని ప్రజలు ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్​ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ రావు, నాయకులు అజ్మీర ధరంసింగ్, గండ్రకోట సుధీర్​, భూక్య దేవ్​సింగ్,​ పూమానాయక్​, పాడ్య కుమార్, కోగిల మహేశ్ తోపాటు బంజారా మహిళలు పాల్గొన్నారు. 

సీఎం సభాస్థలిని పరిశీలించిన మంత్రి 

మహబూబాబాద్, వెలుగు : ఈనెల 27న మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్​ భారీ బహిరంగ సభ కోసం మంత్రి  సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే బానోత్ శంకర్​నాయక్ మున్సిపాలిటీలోని శనిగపురం శివారులో సభాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 70 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, పీఏసీఎస్​ ఛైర్మన్​ నాయిని రంజిత్, బీఆర్ఎస్ నాయకులు మార్నెని వెంకన్న,  పోతురాజు ఉన్నారు.