- వినియోగించుకోకుండా ఉంటున్న వరద జలాలపై దృష్టి: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు సాగునీరందించేలా మున్నేరు–పాలేరు లింక్ స్కీమ్ను చేపడుతున్నట్టు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ పట్టించుకోకుండా ఉన్న సహజ వనరులను వినియోగించుకుంటూ.. వరదల నివారించేలా ప్రభుత్వం ఈ కొత్త స్కీమ్ను తీసుకొస్తున్నదని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఏటా 50 టీఎంసీలను వినియోగించుకునేలా ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లాను ఫ్లాష్ ఫ్లడ్తో వణికిస్తున్న మున్నేరు నది వరద నీటిని ఈ ప్రాజెక్టులో వాడుకుంటామని, తద్వారా ఖమ్మం జిల్లాకు వరదల నుంచి కూడా విముక్తి కల్పిస్తామని తెలిపారు.
సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఈ లింక్ స్కీమ్లోకి మళ్లించి కరువు ప్రాంతాలకు నీళ్లిస్తామన్నారు. వరద జలాల్లో 50 నుంచి 60 టీఎంసీలను వాడుకునేలా మున్నేరు పాలేరు గ్రావిటీ స్కీమ్ ఉపయోగపడుతుందన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ముల్కనూరు చెక్డ్యామ్ నుంచి నీటిని రీడైరెక్ట్ చేస్తామన్నారు. ఆ నీళ్లను పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లింక్ కెనాల్కు తరలించి పంపింగ్ అవసరం లేకుండానే నీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు నిరుడు మే 17వ తేదీనే రూ.162.54 కోట్లతో పరిపాలనా అనుమతులు జారీ చేశామన్నారు. త్వరలోనే దాని నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు.
కరెంట్ ఖర్చుల భారం లేకుండా
ఈ గ్రావిటీ స్కీమ్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్లో అయ్యే కరెంటు ఖర్చులు రూ.120 కోట్ల వరకు ఆదా చేయొచ్చని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇటు సీతారామా ప్రాజెక్టుపైనా భారం తగ్గుతుందన్నారు. ఇది కేవలం నీళ్లకు సంబంధించిన అంశమే కాదని, స్మార్ట్గా నీటిని వినియోగించుకోవడమని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూడు జిల్లాల్లో 1.38 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని, అది కాకుండా ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న 40 వేల ఎకరాలను స్థిరీకరిస్తామని పేర్కొన్నారు.
ఖరీఫ్లో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద 76,308 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలోని డీబీఎం కింద 46,712 ఎకరాలు, అదే జిల్లాలోని డీబీఎం 71 కింద మరో 46,712 ఎకరాలకూ నీళ్లిస్తామన్నారు. మూడు జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం పాలేరు రిజర్వాయర్కు 4.7 టీఎంసీలను ఈ ప్రాజెక్ట్ ద్వారా సప్లయ్ చేస్తామని పేర్కొన్నారు. దాంతోపాటు పాలేరు రిజర్వాయర్ కింద హైడల్ ప్లాంట్లో అదనంగా 2 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు అవకాశం దొరుకుతుందని పేర్కొన్నారు.
