
హైదరాబాద్: రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనుల మరియు భూగర్భ శాఖ మంత్రిగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. 2025, జూన్ 18న సెక్రటేరియట్ సెకండ్ ఫ్లోర్లో తనకు కేటాయించిన చాంబర్లో మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చే ఫైల్ మీద తొలి సంతకం చేశారు మంత్రి వివేక్. మొత్తం 46 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసే రూ.2600 కోట్ల నిధుల ఫైల్పై సైన్ చేశారు.
అంతకుముందు మంత్రిగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా తన చాంబర్లో మంత్రి వివేక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీమణి సరోజాతో కలిసి ప్రత్యేక పూజాల్లో పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ కోసం సచివాలయానికి వెళ్లిన మంత్రి వివేక్కు ఆయన చాంబర్ ముందు పూర్ణకుంభంతో పూజారులు, అధికారులు స్వాగతం పలికారు. మంత్రి వివేక్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన కుమారుడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వివేక్ వెంకటస్వామికి సెక్రటేరియట్లో సహచర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వివేక్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆయనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. మంత్రిగా చార్జ్ తీసుకున్న వివేక్కు పలువురు నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.