హైదరాబాద్: దళితులు ఫామ్హౌస్కు వచ్చారనే కారణంతో రోడ్లను శుద్ధి చేయడం బాధాకరమని మంత్రి వివేక్ అన్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సభాపతిని బీఆర్ఎస్ నేతలు అగౌరవపరిచారని ఆరోపించారు. బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ మొదటి నుంచి దళిత వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తున్నారని మంత్రి వివేక్ విమర్శించారు. అధికారంలోకి రావడానికి దళిత సీఎం చేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా అమలు చేయలేదని అన్నారు.
దళితులకు ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారు?
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎంతమంది దళితులకు కాంట్రాక్టులు ఇచ్చారో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. మరోవైపు మెగా కృష్ణారెడ్డికి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టారని విమర్శించారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుని అధికారంలోకి రావాలని కేసీఆర్ ప్రయత్నించారని ఆరోపించారు.
అధికారం కోల్పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతల అహంకారం తగ్గలేదని మంత్రి వివేక్ మండిపడ్డారు. దళితులు వచ్చినందుకు రోడ్లను శుద్ధి చేయడం వంటి చర్యలు సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తాయని అన్నారు. కనీసం ఈ ఘటనపై క్షమాపణలు చెప్పాలన్న ఆలోచన కూడా బీఆర్ఎస్ నేతలకు లేకపోవడం విచారకరమన్నారు.
75 ఏళ్ల తర్వాత కూడా వివక్షా?
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా దళితులపై వివక్ష కొనసాగడం బాధాకరమని మంత్రి అన్నారు. సమాజంలో కుల వివక్షకు తావులేకుండా అందరూ సమానంగా గౌరవించబడే పరిస్థితులు రావాల్సిన అవసరం ఉందన్నారు.
సొంత పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలను తోసిన ఘటనలు కూడా బీఆర్ఎస్ నేతలే చేశారని మంత్రి వివేక్ ఆరోపించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల కోసం ఏం చేసిందో ఆ పార్టీ నేతలు ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.
