చిగుళ్ల నుంచి రక్తం రావడం అనేది చాలామందిలో కనిపించేదే. బ్రష్ చేసుకుంటున్నప్పుడు ఇలా కనిపించటం మామూలే. బ్రష్ పాతబడినా, చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా వస్తుంది. అయితే ఇది రెగ్యులర్గా కనిపిస్తుంటే మాత్రం లైట్ తీసుకోవద్దు. పంటి సమస్యలు చాలావరకు మన ఇమ్యూనిటీ పవర్ మీదే ఆధారపడి వస్తాయి. అందుకే చిగుళ్లలో రక్తస్రావం రెండు మూడు రోజులకంటే ఎక్కువగా కంటిన్యూ అయితే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిందే...
సరైన ఓరల్ హైజీన్ లేకపొతే చిగుళ్ల దగ్గర పాచి వస్తుంది. దాన్ని అలాగే వదిలేస్తే చిగుళ్ళ వాపు, రక్తం కారడం వంటి సమస్యలొస్తాయి. దీనికి వెంటనే ట్రీట్ మెంట్ గనక తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ పెరిగి పెరియోడాంటైటిస్ గా మారుతుంది. అంటే పన్నుకి ఉండే బేస్ కుళ్లిపోయి పన్ను తీసేయటమే కాదు ఆ ఇన్ఫెక్షన్ మిగతా పళ్లకి కూడా పాకుతుంది. ఇది మరింత ప్రమాదకరం. ఇదంతా మనం సరిగా బ్రష్ చెయ్యకుంటే వచ్చే సమస్య. ఒక్కోసారి లుకేమియా, హీమోఫీలియా లాంటి జబ్బులు ఉన్నా రక్తం వస్తుంది.
మన బాడీలో విటమిన్ -సి, విటమిన్-కె లోపాలున్నా, హార్మోనల్ తేడాలున్నా, కట్టుడు పళ్ళున్నా కూడా ఈ సమస్య వస్తుంది. అందుకే చిగుళ్లనుంచి రక్తం వస్తుంటే ఎక్కువరోజులు నిర్లక్ష్యం చెయ్యొద్దు. చిగురు వాపు, చిగుళ్ళు రంగుమారటం, ఎర్రబడటం, నోరు చెడువాసన రావడం, నోట్లో రుచి తేడాగా అనిపించడం. పళ్ళు కదలడం, బ్రష్ చేస్తుంటే రక్తం కారడం, పళ్ళు బాగా సెన్సిటివ్ అయిపోవటం లాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి దాదాపుగా ఇంట్లోనే ట్రీట్ మెంట్ చేసుకోవచ్చు.
లవంగ నూనె
ఇందులో ఉండే యూజనాల్ వల్ల నొప్పి తగ్గుతుంది. ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెలో రెండు, మూడు చుక్కలు లవంగనూనె కలిపి రోజుకి రెండు సార్లు చిగుళ్ళకి రాసి పది నిమిషాల తరవాత నీళ్లతో పుక్కిలించాలి.
ఉప్పు నీళ్లు
ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ నేచర్ వల్ల వల్ల వాపు తగ్గుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీళ్లలో ఒక స్పూన్ ఉప్పు వేసి రోజుకి మూడుసార్లు ఈ నీళ్లతో పుక్కిలించాలి.
తేనె
చిగురు దగ్గర ప్లేక్ ఏర్పడకుండా చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెని చిగుళ్ళ మీద వేలితో రుద్దాలి. దీనివల్ల చిగుళ్లకి రక్త సరఫరా బాగా జరుగుతుంది. పళ్లదగ్గర వచ్చే ఫ్లేక్ రాకుండా చేస్తుంది.
క్రాన్ బెర్రీ జ్యూస్
బ్రష్ చేస్తున్నా కొద్దిగా ప్లేక్ ఏర్పడుతున్నట్టు అనిపిస్తే రోజుకు ఒకసారైనా చక్కెర వెయ్యకుండా క్రాన్ బెర్రీ జ్యూస్ తాగాలి. స్ట్రా లేకుండా కొద్దికొద్దిగా నోటినుంచి తీసుకుంటూ ఉంటే ఫ్లేక్ పోతుంది. అయితే ఎక్కువ తాగకూడదు, చక్కెర వెయ్యకూడదు అనే రూల్స్ మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సిందే.
సేజ్, పెప్పర్ మింట్ ఆయిల్
ఇవి నోటిని క్లీన్ గా ఉంచుతాయి. మూడు చుక్కల కొబ్బరినూనెలో రెండు చుక్కలు సేజ్ గానీ పెప్పర్ మింట్ ఆయిల్ గానీ కలపాలి. దీన్ని టూత్ పేస్ట్ మీద వేసి రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. దీనివల్ల నోటినుంచి వచ్చే వాసన తగ్గుతుంది. పళ్లమధ్య ఉండే ఫుడ్ పార్టికిల్స్ ఈజీగా పోతాయి.
పసుపు
పసుపులో ఉన్న కుర్క్యుమిన్ ప్లేక్ ఏర్పడకుండా చేసి వాపు లేకుండా చేస్తుంది. అర టీస్పూన్ ఆవనూనెలో అర టీస్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపూ వేసి కలిపి. ఆ పేస్ట్ చిగుళ్ళకి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది పొద్దున, మధ్యాహ్నం చేయటం వల్ల రిజల్ట్ త్వరగా కనిపిస్తుంది.
