
హైదరాబాద్: కార్మికులకు సేవ చేసే అవకాశం రావడం సంతోషం ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 2025, జూన్ 18న సెక్రటేరియట్ సెకండ్ ఫ్లోర్లో తనకు కేటాయించిన చాంబర్లో రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనుల మరియు భూగర్భ శాఖ మంత్రిగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి కాకా వెంకటస్వామి అడుగు జాడల్లో ముందుకు వెళ్తానన్నారు.
కార్మికులకు దివంగత వెంకటస్వామి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. కార్మికుల సమస్యలపై తనకు అవగాహన ఉందని.. గిగ్ వర్కర్ల కోసం మంచి పాలసీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. గిగ్ వర్కర్ల హక్కుల కోసం ఎక్స్పర్ట్స్తో కాన్ఫరెన్స్ పెడుతామన్నారు. నైపుణ్య శిక్షణ పెంచితేనే ఉపాధి కల్పన జరుగుతోందని.. ఇందులో భాగంగానే రాష్ట్రంలో రూ.2600 కోట్లతో 45 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ప్రారంభిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని బొగ్గు గనుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొంటుందని స్పష్టం చేశారు. బొగ్గు గనుల కేటాయింపు కంటే.. వేలంలో పాల్గొంటేనే బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక, రాష్ట్రంలో సాండ్ మాఫియా ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక దొరికేలా కృషి చేస్తామన్నారు. తన నియోజకవర్గం చెన్నూరులో ఇసుక అక్రమ రవాణా అరికట్టామని పేర్కొన్నారు.