- డీవోపీటీకి 25 మందితో లిస్ట్ పంపిన రాష్ట్ర ప్రభుత్వం
- 24, 27 తేదీల్లో ఇంటర్వ్యూలు
హైదరాబాద్, వెలుగు : కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన లిస్ట్లో మంత్రుల పీఎస్లు, ఓఎస్డీలు ఉన్నారు. దీంతో పాటు మంత్రి కేటీఆర్ చూస్తున్న మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ర్టీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఆఫీసర్లే ఉన్నారు. నాన్ రెవెన్యూలో ఖాళీగా ఉన్న ఐదు కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టుల కోసం 25 మంది లిస్ట్ను కేంద్ర శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ)కి పంపింది.
వీరికి 24, 27వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 5న యూపీఎస్సీ సమాచారం పంపింది. ఈ జాబితాలో మంత్రి హరీశ్రావు దగ్గర పీఎస్గా పనిచేస్తున్న అశోక్ రెడ్డి, మంత్రి కేటీఆర్ దగ్గర ఓఎస్డీగా ఉన్న మహేందర్, అడిషనల్ పీఎస్ కాత్యాయనీ దేవి పేర్లున్నాయి. వీరితో పాటు గతంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఓఎస్డీగా పనిచేసి, ప్రస్తుతం టీఎస్ ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సి.చంద్రకాంత్ రెడ్డి ఉన్నారు. టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఇండస్ర్టీస్ డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో ఉన్న సురేశ్, డి.శ్రీనివాస్ నాయక్, ప్రశాంత్ కుమార్ ఉన్నారు. మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న యాదగిరి రావు, వి.సైదా, టి.వెంకన్న పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు కె.హరిత, నవీన్ నికోలస్, సర్వేశ్వర్ రెడ్డి, వి.శ్రీనివాస్ రెడ్డి, పి.వెంకటేశం, లక్ష్మణుడు, పుల్లయ్య, ఏడుకొండలు, డి.హనుమంతు, పాపయ్య, నారాయణరావు, పద్మజ పేర్లు లిస్ట్లో ఉన్నాయి. వీరందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాతే ఐదుగురిని కన్ఫర్డ్ ఐఏఎస్లుగా ప్రకటిస్తారు.