- జీడిమెట్ల భూ వివాదం కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న కోర్టు
హైదరాబాద్/శామీర్ పేట, వెలుగు: రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని వివాదాస్పద భూమి విషయంలో పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ఉమశనం కల్పించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. జీడిమెట్ల గ్రామంలో సర్వే నంబర్ 82, 83లోని రెండున్నర ఎకరాల వివాదాస్పద భూమికి సంబంధించి సివిల్ కోర్టుల్లో పలు వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నందున తాము పిటిషనర్కు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. అలాగే,కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జీడిమెట్లలోని భూమికి సంబంధించి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, తమ అధీనంలోని భూమి విషయంలో పేట్ బషీరాబాద్ పోలీసులు, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులివ్వాలంటూ వారిద్దరితో పాటు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అనిల్కుమార్ జూకంటి గురువారం విచారణ చేపట్టారు. 2011లో పిటిషనర్లు ఆ భూమిని కొనుగోలు చేశారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ మే 18న ఈ భూమిని సర్వే చేయడానికి పోలీసులతో వచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ఆ రెండున్నర ఎకరాలు పిటిషనర్లవి కావని పేర్కొంటూ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యాపారి మరికొందరితో కలసి అప్పటికే ఉన్న షెడ్లను కూలగొట్టారని చెప్పారు. అనంతరం ఈ భూమికి సంబంధించిన రికార్డులను కోర్టు ముందు ఉంచాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని చెబుతూ విచారణను వారం రోజులు వాయిదా వేసింది.