- వీడియో తీసి వైరల్ చేస్తామని బెదిరింపు
- ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఓ బాలికపై నలుగురు దుర్మార్గులు అకృత్యానికి పాల్పడ్డారు. ఇంట్లో పెద్దలు లేని సమయంలో చొరబడి బాలిక తమ్ముడికి తుపాకీ పెట్టి బెదిరించి, అతడి ఎదుటే అమ్మాయిపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఆ సమయంలో వీడియో తీసి, విషయం బయట చెబితే దాని వైరల్ చేస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన శనివారం జరిగింది. ఆ పిల్లల తల్లిదండ్రులిద్దరూ తమ బంధువులు ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో సమీపంలోని గ్రామానికి వెళ్లారు. ఆ సమయంలో 12 ఏండ్ల కొడుకు, 15 ఏండ్ల కూతురు మాత్రమే ఉండడం చూసి పొరుగు ఇంట్లో ఉండే వ్యక్తి చూసి తన ముగ్గురు ఫ్రెండ్స్తో లోపలికి దూరాడు. ఆ పిల్లాడికి తుపాకీ పెట్టి అరిస్తే చంపేస్తామని బెదిరించి, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మొత్తాన్ని వీడియో తీసి, బయటకు చెబితే వైరల్ చేస్తామని వెళ్లిపోయారు. అప్పటికే ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో భయపడిన తమ్ముడు వెంటనే తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. హుటాహుటీన వచ్చిన తండ్రి ఆ బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కొడుకు విషయం చెప్పడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు పెట్టాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆ బాలికపై అత్యాచారం జరిగినట్లు కన్ఫామ్ చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు. ఐదు టీమ్స్ ఏర్పాటు చేసి వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అయితే మంగళవారం ఉదయం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ముజఫర్నగర్ పోలీసులు తెలిపారు. నాలుగో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు.