రాష్ట్రంలో 40 మిరాజ్ మల్టీప్లెక్స్‌ లు

రాష్ట్రంలో 40 మిరాజ్ మల్టీప్లెక్స్‌ లు

వెలుగు: మిరాజ్ సినిమాస్ రాబోయే15 నెలల్లో తెలంగాణలో మరింత విస్తరించనుంది. హైదరాబాద్‌‌లో ప్రస్తుతం 4 స్క్రీన్లుండగా, విస్తరణలో భాగంగా మరో 36 స్క్రీన్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలలో కూడా మల్టీప్లెక్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తెలంగాణలో స్క్రీన్ల పెంపుకు దాదాపు రూ.80 కోట్ల దాకా ఖర్చుచేయనున్నట్లు మిరాజ్ సినిమాస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ భువనేష్ మెండిరట్ట చెప్పారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 110 స్క్రీన్లుండగా, మరో 15 నెలల్లో వీటిని రెండింతలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టు కున్నామన్నారు. ఇప్పటికే రూ.150 కోట్ల మేరపెట్టు బడులు పెట్టగా, మరో వంద స్క్రీన్ల కోసం రూ.200 కోట్లు పెట్టు బడి పెట్టనున్నట్లు తెలిపారు. మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌‌లో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉందని చెప్పారు. తెలుగుతో పాటు హిందీ సినిమాలకు కూడా ఆదరణ ఎక్కువగా ఉందని భువనేష్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్ల రెవెన్యూను సాధించగా, వచ్చేయేడాది రూ.325 కోట్ల రెవెన్యూ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న సింగిల్, ఇండిపెండెంట్ స్క్రీన్లను మిరాజ్ సొంతం చేసుకుని వాటిని3–4 స్క్రీన్ల మల్టీప్లెక్సులుగా మారుస్తోంది. వీటిని అధునాతనంగా మార్చడానికి, ఇంటీరియర్‌ వంటి వాటి కోసం స్క్రీన్‌ కు రూ.2 కోట్ల మేర ఖర్చవుతుందని మిరాజ్ తెలిపింది.