Mirzapur : తలకిందులుగా వేలాడదీసి.. కారం కొట్టారు

Mirzapur : తలకిందులుగా వేలాడదీసి.. కారం కొట్టారు

ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని చూపించే ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌లు రోజురోజుకూ పెరుగుతున్నా పోలీసులంటే మాత్రం ఏ మాత్రం భయంలేదన్నట్టనిపిస్తోంది ఈ వీడియో చూస్తుంటే. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ యువకుడిని చెట్టుపై నుంచి తలకిందులుగా కట్టేసి దారుణంగా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ అమానవీయ చర్యకు సంబంధించిన ఈ క్లిప్ లో కొంతమంది యువకులను దారుణంగా కొట్టడం చూడవచ్చు.

నలుగురు నిందితులపై కేసు నమోదు  

డ్రమ్మండ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని రాజేష్ ధైకర్‌గా గుర్తించారు. దోపిడీకి పాల్పడినట్లు అనుమానంతో పట్టుకున్న తర్వాత రాజేష్ ధైకర్ బాధితురాడిని చిత్రహింసలకు గురిచేశాడు. భారతదేశంలో కూడా తాలిబాన్ శిక్షలు బహిరంగంగానే జరుగుతున్నాయని ఈ సంఘటన హైలైట్ చేస్తుంది.

రాజేష్ ధైకర్ ఇతర నిందితులతో కలిసి జైశంకర్ బహేలియాను దొంగతనం అనుమానంతో పట్టుకుని చెట్టుకు తలక్రిందులుగా కట్టివేసి, ఆపై బాధితుడిని దారుణంగా కొట్టాడు. వారు అతని శరీరానికి కారం పొడిని కూడా రాసి అతన్ని తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో అతని చేతి ఎముక విరిగినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో గ్రామస్తులు కూడా ఏమీ పట్టనట్టు చూస్తూ, వీడియోను రికార్డు చేస్తుండడం గమనార్హం. బాధితుడు తనను కొడుతున్నపుడు విడిచిపెట్టమని చేతులు జోడించి విన్నవించుకున్నా.. వారు మాత్రం అతనిపై కొంచెం కూడా కనికరం చూపలేదు.