
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. గోపీనాథ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ట్రీట్మెంట్కు సహకరిస్తున్నారని ఆయన చెప్పారు. దయచేసి మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరో 48 గంటలు గడిచాక డాక్టర్లు ఏ విషయం అనేది చెప్తామన్నారని హరీష్ రావు వెల్లడించారు. గోపీనాథ్ అనారోగ్యంతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిన వెంటనే హరీష్ రావు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. వైద్యులతో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కొన్ని గంటల పాటు అక్కడే ఉన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కూడా ఏఐజీ హాస్పిటల్కు వెళ్లి జూబ్లీహిల్స్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ మానసిక ఆందోళనకు గురి కావద్దని, మీడియా తప్పుడు సమాచారని అందించవద్దని కోరారు. మాగంటి గోపీనాథ్ క్రమంగా కోలుకుంటున్నారని, ఇప్పటి వరకూ ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. వైద్యానికి స్పందిస్తున్నారని చెప్పారు.
ఇటీవల జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల మాగంటి గోపీనాథ్ కొంత ఒత్తిడికి గురయ్యారని, సర్దార్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి ఆయన మానసికంగా ఇబ్బందిపడ్డారని దాసోజు తెలిపారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుకుంటున్నామని, అందరూ పూజలు చేయాలని కోరుతున్నామని.. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో మాగంటి ఉంటారని దాసోజు శ్రవణ్ వెల్లడించారు.