
ఆమనగల్లు, వెలుగు: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందిస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆమనగల్లు పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి, పనులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు గూడు కల్పించడమే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చేపట్టినట్లు వివరించారు.
ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ ప్రజల హక్కులను కాపాడేందుకు తనవంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో నాయకులు జగన్, గుర్రం కేశవులు, వెంకటరెడ్డి, మెకానిక్ బాబా, శివలింగం, రవీందర్, కృష్ణ నాయక్, అప్పం శ్రీను, ఖాదర్, సురేశ్ నాయక్ పాల్గొన్నారు.