
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మున్సిపల్ పరిధిలో 360 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీని అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వల్ల నాగర్కర్నూల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. త్వరలోనే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మాజీ కౌన్సిలర్స్, నాయకులు పాల్గొన్నారు.