కొత్త వాహనం ఇవ్వకపోతే..పాతదాన్ని తీసుకోండి: ఎమ్మెల్యే రాజాసింగ్

కొత్త వాహనం ఇవ్వకపోతే..పాతదాన్ని తీసుకోండి: ఎమ్మెల్యే రాజాసింగ్

ఇంటెలిజెన్స్ ఐజీకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు.ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వెహికిల్ ..తరచూ రిపేర్లకు గురవుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తగా నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చినప్పడు..తనకెందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇవ్వొద్దని చెప్పారా... లేక మీరే ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. కొత్త వెహికల్ ఇవ్వకపోతే..పాతదాన్ని తీసుకోవాలని ఐజీని కోరారు.

తెలంగాణ ప్రభుత్వం తనకు కేటాయించిన 13 ఏండ్ల నాటి పాడైన బులెట్ ప్రూఫ్ వాహనాన్ని ఉపయోగించడం సిగ్గు అనిపిస్తుందని  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తంచేశారు. రన్నింగ్ లో ఉన్నప్పుడు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతూ తరచూ ఇబ్బందులు కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కండీషన్ లో లేకపోవడంతో గోషామహల్ నియోజకవర్గంలో అత్యవసరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు వెళ్లలేక  ఆటంకాలు కల్పిస్తుందన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణాలో ఒక ఎమ్మెల్యేకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వలేకపోయారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ఇటీవల అఫ్జల్ గంజ్ మార్కెట్ వద్ద రాజాసింగ్ కు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ కారు మొరాయించింది. డ్రైవర్ కారు దిగి మళ్లీ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు  మొరాయించడానికి కారణం తెలుసుకునేందుకు రాజాసింగ్ సైతం కారు దిగి  ప్రయత్నం చేసినా కారు స్టార్ట్ కాలేదు. దీంతో రాజాసింగ్ తన కారును, డ్రైవర్ ను అక్కడే వదిలేసి.. నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు.  ప్రాణహాని ఉన్న తన పట్ల ప్రభుత్వ తీరు సరిగా లేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.