
పాలమూరు, వెలుగు: ఉచిత కోచింగ్ తీసుకున్న విద్యార్థులు అందరూ పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం పట్టణం లోని అంబేద్కర్ కళాభవన్ లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో హైదరాబాద్ ఫ్యాకల్టీ తో ఉచిత కోచింగ్ ఇవ్వడంతోపాటు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫ్రీ కోచింగ్ పట్ల యువత ఆసక్తి చూపడం సంతోషంగా ఉందన్నారు.
మండుటెండలో సైతం ఎంతో శ్రద్ధగా వచ్చి తరగతులను వినడం అభినందనీయమన్నారు . మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు శిక్షణా కేంద్రంలో సైతం ఎంతో మంది నిరుద్యోగ మహిళలకు వివిధ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. రానున్న పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జీవితంలో మీరంతా స్థిరపడాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి తండాకు బీటీ రోడ్డు వేయిస్తా
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: మహబూబ్నగర్ నియోజకవర్గంలోని ప్రతి తండాకు బీటీ రోడ్డు వేయిస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని లాల్యానాయక్ తండాలో రూ. 2.10 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణపు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష ప్రజా ప్రభుత్వ పాలనలో సాకారం అయిందన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, నాయకులు తులసి రాం నాయక్, రాజు గౌడ్, ప్రతాప్ రెడ్డి, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.