- మల్లన్న సాగర్ పాపాల భైరవుడు ఆయనే
- బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. మూసీ నది బాగుపడితే హైదరాబాద్ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారన్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ఒక ప్రకటనలో హరీశ్రావుకు కౌంటర్ఇచ్చారు. గతంలో హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లుగా మారుస్తానని కేసీఆర్ బడాయి కబుర్లు చెప్పి మోసం చేశారని గుర్తుచేశారు. మూసీ సుందరీకరణ కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పిన కేటీఆర్ ఆ పేరుతో కోట్ల రూపాయలు దండుకుని సిటీ వాసులను దగా చేశారని విమర్శించారు.
ప్రస్తుతం గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అపార్ట్మెంట్ నోటీసుల విషయంలో హరీశ్రావు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు. మల్లన్న సాగర్ కోసం14 గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించినప్పుడు హరీశ్ రావుకు బాధితులు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. హరీశ్ రావు చర్యల వల్ల నాడు మల్లన్న సాగర్ బాధితులు అనేక మంది చనిపోయారని గుర్తుచేశారు. మల్లన్న సాగర్ పాపాల భైరవుడు ఆయనే అని ఫైర్ అయ్యారు.
