నిజాం చెక్కర ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలి

నిజాం చెక్కర ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలి

నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో రైతుల ధర్నాకు జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలంటూ బోనాల వేడుక నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ.. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించారు. ఆ తర్వాత షుగర్ ఫ్యాక్టరీ ముందు బైఠాయించారు. 

షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రైతులు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల రైతు నాయకులను పిలిపించుకొని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న చెరుకు రైతులపై ఎందుకు కనికరం చూపడం లేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కొత్త ఫ్యాక్టరీలు తెస్తున్నట్లు పదేపదే చెబుతున్న కేసీఆర్.. ఉన్న ఫ్యాక్టరీలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని నిలదీశారు. మూతపడ్డ మూడు నిజాం చెక్కర ఫ్యాక్టరీలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు.