ఎమ్మెల్సీ కవితకు నేనంటే భయం : ఎంపీ అర్వింద్

ఎమ్మెల్సీ కవితకు నేనంటే భయం : ఎంపీ అర్వింద్

 

  • నా మీద పోటీ చేసే దమ్ము లేదు 
  • ముక్కు నేలకు రాసుడు కాదు..చెప్పు..బూటు కూడా రాయా
  • త్వరలోనే కవిత జైలుకు పోవడం ఖాయం
  • నిజామాబాద్ ఎంపీ అర్వింద్

జగిత్యాల/జగిత్యాల టౌన్/నిజామాబాద్​,  వెలుగు : ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో రూ.100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందని, త్వరలో ఆమె కూడా జైలుకు పోతదని నిజామాబాద్​ఎంపీ అర్వింద్ ​ధర్మపురి అన్నారు. సోమవారం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు  ఇవ్వాలంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాతో  పాటు నిజామాబాద్​ పాత కలెక్టరేట్​ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో  నిర్వహించిన మహా ధర్నాలో ఎంపీ అర్వింద్ పాల్గొని మాట్లాడారు. ‘నా మీద పోటీ చేసేందుకు కవిత భయపడుతోంది. పోటీ చేసే దమ్ము లేక మరొక అభ్యర్థిని బరిలో ఉంచి నన్ను ఓడిస్తుందట’ అని ఎద్దేవా చేశారు. 

లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం జైలు పాలైండని, ఆయనను చూసేందుకు ఇక కవితక్క పోతదన్నారు. అందరూ కవితక్క జైలుకు పోవాలని దేవున్ని మొక్కాలన్నారు.  43 వేల మంది నిర్వాసితులకు ఇండ్లు ఇస్తామని ఏ లెక్క ఆధారంగా ఫైనాన్స్​ మినిస్టర్​ హరీశ్​రావు చెబుతున్నారని ప్రశ్నించారు. మద్యం నిషాలో సీఎం కేసీఆర్​ చెప్పిన ప్రతిదానికి హరీశ్​తలూపుతున్నారన్నారు. అవినీతిని ప్రశ్నించినందుకు ముక్కు నేలకు రాయాలని కవిత కోరుతున్నారని, ఆమె పేరు ఉంటే తానెందుకు ముక్కు నేలకు రాయాలని, బూటు, చెప్పు కూడా రాయనన్నారు.   సీఎం కేసీఆర్ ముక్కు భూమి రాసేలా చేస్తానన్నారు.

రెండు సార్లు గెలిచి ఏం చేసిండు...

డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం రూ.18,500 కోట్లు కేటాయించినా...ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదని కేసీఆర్​పై అర్వింద్​ మండిపడ్డారు. ఏపీలో 8 లక్షలు, తమిళనాడులో 5 లక్షల ఇండ్లు పీఎంఏవై కింద కట్టుకున్నారని, ఆ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదన్నారు. మన రాష్ట్రంలో ఆవాస్ యోజన ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. డబుల్ ఇండ్లు, కాళేశ్వరంలోని అవినీతి సొమ్ముతో కేసీఆర్ ​మహారాష్ట్రలో పార్టీ ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించారు.

 మహారాష్ట్రలో  ప్రతి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడికి నలభై లక్షల ఫార్చ్యునర్ కారు ఇచ్చారని, ప్రతి నెలా రూ. 10 లక్షల జీతం ఇస్తున్నారని ఆరోపించారు. జగిత్యాలలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్, భోగ శ్రావణి,  నేతలు జేఎన్​వెంకట్, మదన్​మోహన్,  అనిల్ కుమార్,  రెంటం జగదీశ్​పాల్గొనగా, నిజామాబాద్​లో జిల్లా పార్టీ ప్రెసిడెంట్​ బస్వాలక్ష్మీనర్సయ్య, మున్సిపల్​ ఫ్లోర్ లీడర్​ స్రవంతిరెడ్డి, మల్లిఖార్జున్​రెడ్డి, పెద్ధోళ్ల గంగారెడ్డి, అల్జాపూర్​ శ్రీనివాస్​, దినేష్​ కులాచారి, మేడపాటి ప్రకాష్​రెడ్డి, వడ్డీ మోహన్​రెడ్డి, ప్రవళిక ఉన్నారు.