తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి నీళ్లు కాదు నిప్పులొస్తయ్: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి నీళ్లు కాదు నిప్పులొస్తయ్: ఎమ్మెల్సీ కవిత

దేశంలో ఉన్నటువంటి సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.  ముషీరాబాద్ లో జరిగిన తెలంగాణ జాగృతి సమావేశంలో మాట్లాడిన కవిత..  ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, రైతులు, కళాకారులను, కవులను  ఏకం చేసుకుని ముందుకెళ్తామన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సీబీఐ, ఈడీ దాడులు చేస్తూ... తమ సమయాన్ని వృథా చేస్తోందన్నారు. ఎన్ని దాడులు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. రెస్ట్ తీసుకోను..రిలాక్స్ కూడా అయ్యేది లేదన్నారు. తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి నీళ్లు రావని..నిప్పులొస్తాయని అన్నారు. తెలంగాణ జాగృతి నుంచి అన్ని రాష్ట్రాలకు వెళ్తామన్నారు. రాష్ట్రానికి  జరిగిన అన్యాయంపై .. ఉద్యమ స్పూర్తితో  దేశంలోని సమస్యలపై పోరాడతామన్నారు.

జాగృతికి జయశంకర్ సార్, కేసీఆర్ లు గురువులు

ఫోర్త్​ ఎస్టేట్ ప్రైవేట్ ఎస్టేట్ గా మారిందని కవిత అన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కూల్చేస్తోందని ఆరోపించారు. కేంద్రం కుట్రలను మీడియా ఎత్తి చూపాలన్నారు. అన్యాయాన్ని అందరూ ప్రశ్నించాలని.. కేంద్రం చేస్తున్న అరాచాకాలను అన్ని పత్రికలు ప్రశ్నించాలన్నారు. లీకులిచ్చి  వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. దళిత విద్యార్థులకు దేశంలో ఎక్కడా స్కాలర్ షిప్ ఇవ్వడం లేదన్నారు.  తెలంగాణ సాహిత్యం, సంస్కృతిని  జాగృతి కాపాడుతోందన్నారు. జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశామన్నారు. తెలంగాణ జాగృతికి జయశంకర్ సార్, కేసీఆర్ లు గురువులన్నారు. 8 ఏళ్లలో పరిపుష్టమైన కార్యక్రమాలను నిర్వహించుకున్నామన్నారు. ఆనాడు బతుకమ్మను ఎత్తుకోవాలంటే సిగ్గుపడ్డారని తెలిపారు. మన కళలు, సంస్కృతిని పాఠ్యాంశాల్లో చేర్చుకున్నామన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటామన్నారు. మన పండుగలను, కళలను కాపాడుకున్నామని కవిత అన్నారు.