
మెదక్, వెలుగు: రిజర్వేషన్లు తేలేదాకా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం మెదక్ లో నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేస్తం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనను చిత్తశుద్ధితో చేయలేదు. గ్రామ పంచాయతీలో కులాల వారీగా ఎంత మంది ఉన్నారనే లిస్ట్ పెడితే వాస్తవాలు బయట పడ్తయ్. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. బిల్లు ఢిల్లీకి పంపి చేతులు దులుపుకుంది.
బీసీ బిల్లుకు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా జులై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్రోకో చేపడ్తం” అని ప్రకటించారు. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకొని ఢిల్లీకి సెగ తగిలేలా పెద్ద ఎత్తున రైల్రోకో చేపడతామని తెలిపారు. బీసీ మేధావులు, విద్యార్థులు, మహిళలు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున కలిసిరావాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు పోరాటం చేస్తున్నామని కవిత చెప్పారు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీసీ బిల్లు గురించి ఒక్క రోజు కూడా మాట్లాడలేదని ఆమె విమర్శించారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ శివశంకర్
తదితరులు పాల్గొన్నారు.