ప్రీపెయిడ్ మొబైల్ సేవలపై
బ్యాన్ ఎత్తేసిన అధికారులు
రెండు జిల్లాల్లో 2జీ సేవలు పునరుద్ధరణ
జమ్మూ: జమ్మూకాశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు కారణంగా ఐదు నెలలుగా బ్యాన్ విధించిన అధికారులు శనివారం పునరుద్ధరించారు. వాయిస్ కాల్స్, మెసేజ్ సర్వీసులపై ఉన్న ఆంక్షలను ఎత్తేస్తున్నట్లు జమ్మూకాశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సల్ చెప్పారు. రెండు జిల్లాల్లో 2జీ సర్వీసులను తిరిగి ప్రారంభించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవల విషయంలో సిమ్కార్డుల క్రెడన్షియల్స్ను ధ్రువీకరించాలని సర్వీస్ ప్రొవైడర్లకు సూచించారు. జమ్మూలోని పదిజిల్లాలు, కాశ్మీర్లోని రెండు జిల్లాల్లో బ్రాడ్బ్యాండ్ సేవలను తిరిగి ప్రారంభించాలని చెప్పారు. జమ్మూకాశ్మీర్లో పోయిన ఏడాది ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం రెండు యూనియన్ టెరిటరీలుగా విడగొట్టింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్య కింద మొబైల్ సేవలపై బ్యాన్ విధించింది. ఇంటర్నెట్పై ఆంక్షలు వద్దని, అన్ని ఆంక్షలపై వారంలోగా రివ్యూ చేయాలని పోయిన శనివారం సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
For More News..