
- అధికార పార్టీ నేతలే కొన్ని ఇండ్లు తగులబెట్టారు
- బుజ్జగింపు రాజకీయాల కోసం కొందరి ప్రాణాలు బలిపెట్టారు
- రాష్ట్రంలో క్రైమ్స్, స్కామ్స్ పెరిగిపోయాయని ఫైర్
అలీపుర్ ద్వార్: పశ్చిమ బెంగాల్లో నిర్మమత (దయలేని) సర్కార్ నడుస్తున్నదని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఇటీవల ముర్షీదాబాద్, మాల్దాలో జరిగిన మత ఘర్షణలు మమతా బెనర్జీ సర్కార్ క్రూరత్వానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. గురువారం బెంగాల్లోని అలీపుర్ద్వార్లో రూ.1,010 కోట్లతో చేపట్టిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బెంగాల్లో జరిగిన ఘర్షణలను ప్రస్తావించారు. ‘‘ముర్షీదాబాద్, మాల్దాలో జరిగిన హింసాత్మక ఘటనలు బెంగాల్ సర్కార్ క్రూరత్వానికి నిదర్శనం. బుజ్జగింపు రాజకీయాల కోసం కొంతమంది ప్రాణాలను బలిపెట్టారు.
అధికార పార్టీ నేతలు కొన్ని ఇండ్లను మార్క్ చేసి మరీ తగులబెట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అడ్డుకోకుండా చూస్తూ ఉండిపోయారు. ప్రభుత్వాన్ని నడిపేది ఇలాగేనా? ఇక్కడ ప్రతి అంశంపై కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తున్నది. లేకపోతే ఏదీ పరిష్కారం కావడం లేదు” అని అన్నారు. ‘‘బెంగాల్లో సంక్షోభం నెలకొన్నది. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. హింస పెరిగిపోయింది. క్రైమ్స్, స్కామ్స్ విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉదాసీనతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సర్కార్పై జనానికి నమ్మకం పోయింది. ఈ క్రూరమైన సర్కార్ మాకు అక్కర్లేదని వాళ్లంతా అంటున్నారు” అని పేర్కొన్నారు.
టీఎంసీకి 24 గంటలూ రాజకీయాలే..
తృణమూల్ సర్కార్ హయాంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నదని మోదీ మండిపడ్డారు. ‘‘మమత సర్కార్ వేల కోట్ల టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్కు పాల్పడింది. ఇది కేవలం కొన్ని వేల మంది టీచర్ల జీవితాలను నాశనం చేయడమే కాకుండా, మొత్తం విద్యావ్యవస్థనే నాశనం చేసింది. ఇంత జరిగినా తృణమూల్ కాంగ్రెస్ నేతలు తమ తప్పును ఒప్పుకోవడం లేదు. పైగా వాళ్లు చేసిన తప్పులకు న్యాయవ్యవస్థను బద్నాం చేస్తున్నారు” అని ఫైర్ అయ్యారు.
రాష్ట్ర సర్కార్ చేసిన అవినీతితో పేదలు, మధ్య తరగతి ప్రజలు, యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తృణమూల్ సర్కార్ బెంగాల్లో అమలు చేయడం లేదన్నారు. ‘‘మమత సర్కార్కు పేదలంటే ఎందుకింత కోపం?” అని మండిపడ్డారు. ఇటీవల నీతిఆయోగ్ మీటింగ్కు మమత హాజరుకాకపోవడంపై స్పందిస్తూ.. టీఎంసీకి 24 గంటలూ రాజకీయాలే కావాలని, రాష్ట్ర, దేశాభివృద్ధి పట్టదన్నారు.
ఆపరేషన్ సిందూర్ అయిపోలేదు..
ఆపరేషన్ సిందూర్ ఇంకా అయిపోలేదని మోదీ స్పష్టం చేశారు. ‘‘సిందూర్ ఖేలా జరిగే బెంగాల్ గడ్డ నుంచి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. పహల్గాం ఉగ్రదాడిపై బెంగాల్లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఉగ్రవాదులు మన ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచేశారు. కానీ ఆ సిందూరం పవర్ ఏంటో ఆ ఉగ్రవాదులకు మన సైనికులు చూపించారు. ఆ ఆపరేషన్ సిందూర్ ఇంకా అయిపోలేదని.. ఈ బెంగాల్ గడ్డ నుంచి 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రకటిస్తున్నాను” అని తెలిపారు.
భారత్లో ఉగ్రదాడులు చేస్తే, దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రపంచానికి చాటిచెప్పామన్నారు. ఇప్పటికే మూడుసార్లు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేశామని చెప్పారు. పాక్కు నేరుగా యుద్ధం చేయడం చేతకాదని, అందుకే ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నదని మండిపడ్డారు.
బిహార్లో మోదీ మెగా రోడ్ షో
ప్రధాని మోదీ గురువారం సాయంత్రం బిహార్కు చేరుకున్నారు. పాట్నా ఎయిర్పోర్టులో నిర్మించిన కొత్త టెర్మినల్ బిల్డింగ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎయిర్పోర్టు నుంచి బీజేపీ ఆఫీస్ వరకు 4 కి.మీ. మేర మెగా రోడ్ షో నిర్వహించారు. దీనికి వేలాది మంది జనం హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.
ప్రజలు చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని రోడ్డుకు ఇరువైపులా నిల్చొని నినాదాలు చేశారు. కాగా, సిక్కిం అవతరణ దినోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందులో భాగంగా సిక్కింలో భారీగా ఉద్యోగాలు వస్తాయన్నారు.