
- 170 ఏళ్ల క్రితమే బెంగళూరులో ‘మోడీ మసీదు’
- 1849లో కట్టించిన వ్యాపారి మోడీ అబ్దుల్ గఫూర్
- మరో రెండు ‘మోడీ మసీదు’లూ కట్టించిన ఆయన కుటుంబం
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ మసీదుంది. దానిపేరు మోడీ మసీదు. బెంగళూరు టాస్కర్ టౌన్లో ఉందది. ఇప్పుడు ఆ మసీదుపై నెట్టింట పెద్ద పుకారే లేచింది. ఇటీవలి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ఘన విజయం సాధించడంతో, మసీదుకు మోడీ పేరు పెట్టారని కొందరు ట్విట్టర్లో ఫొటోలు పెట్టారు. కానీ, కాలం మునుపటిలా లేదు కదా. ఏది చెప్పినా, దాంట్లో నిజమెంతో, అబద్ధమెంతో తెలుసుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఇప్పుడు ఈ మసీదుపై రేగిన పుకారు పరిస్థితి అదే. అరె బాబు, అది ప్రధాని నరేంద్ర మోడీ పేరు కాదు, ఆ మోడీ వేరే అంటూ సదరు యూజర్లకు మరికొందరు నెటిజన్లు మొట్టికాయలు వేశారు. ఇంకొందరైతే అది మోడీ పేరు కాదనేందుకు ఆధారాలనూ షేర్ చేశారు. ‘‘బెంగళూరు ముస్లింలు మసీదుకు మోడీ పేరు పెట్టారు. ఇది చూస్తే ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారో” అంటూ ఓ యూజర్ ఆ మసీదుపై పోస్ట్ పెట్టాడు. అయితే, నెటిజన్ల నుంచి విమర్శులు రావడంతో సారీ, సారీ తప్పైపోయిందంటూ సరిచేసుకున్నాడు.
ఇంతకీ ఆ మోడీ ఎవరు?
‘‘ఈ మసీదు కట్టి 170 ఏళ్లవుతోంది. కానీ, ప్రధాని మోడీ వయసు 69 ఏళ్లే. కాబట్టి, మసీదుకు, ప్రధానికి ఎలాంటి సంబంధం లేదు” అని మసీదు ఇమామ్ గులామ్ రబ్బాని స్పష్టం చేశారు. 1849లో మిలటరీ, సివిల్ స్టేషన్గా టాస్కర్ టౌన్ ఉండేది. అదే టౌన్లో సంపన్నుడైన ఓ వ్యాపారి ఉండేవారు. ఆయనే మోడీ అబ్దుల్ గఫూర్. ఆయనే ఆ మసీదు కోసం ఉన్నదంతా రాసిచ్చేశారు. దీంతో అది మోడీ మసీదుగా పేరుబడిపోయింది. ‘‘మసీదు అవసరం ఎంతో ఉందని మోడీ అబ్దుల్ గఫూర్ గుర్తించారు. వెంటనే 1849లోనే ఆయనే సొంత ఖర్చుతో మసీదు కట్టించారు. అందుకే అది మోడీ మసీదు అయింది” అని మోడీ మసీదు కమిటీ సభ్యుడు ఆసిఫ్ మక్కేరి తెలిపారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు టానరీ రోడ్డులో మరో రెండు మసీదులూ కట్టించారని, వాటి పేర్లూ మోడీ మసీదులేనని చెప్పారు. టానరీ ఏరియాకు ‘మోడీ రోడ్డు’ అన్న పేరు కూడా ఉందన్నారు. మోడీ కట్టించిన మసీదు శిథిలావస్థకు చేరడంతో దానిని కూల్చేసి కొత్తగా కట్టించామన్నారు. గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణం చేసిన టైంలోనే దానిని ప్రార్థనల కోసం తెరిచామన్నారు.