మోడీ టూర్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు: సీపీఐ నారాయణ

మోడీ టూర్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు: సీపీఐ నారాయణ

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనలో కేవలం రాజకీయ దురుద్దేశం తప్ప  ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ రెండో స్థానంలో వచ్చినందుకు రాష్ట్ర బీజేపీ  క్యాడర్ లో బలం పెంచుకునేందుకు మోడీ వచ్చారని విమర్శించారు. 

ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనపై మీడియా సమావేశంలో స్పందించిన సీపీఐ నేత నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. సింగరేణిని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పట్లో నేరుగా ప్రైవేటీకరణ చేయలేకపోయినా.. భవిష్యత్తులో నిర్వీర్యం చేయనున్నారని ఆరోపించారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంటే.. కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉండడం వల్ల నేరుగా ప్రైవేటు పరం చేయకుండా.. నాలుగు బ్లాక్స్ ను ప్రైవేటు పరం చేశారని అన్నారు. సింగరేణి పరిధిలోని బ్లాక్స్ లో బొగ్గు నిల్వలు అయిపోయాక.. ఉత్పత్తి తగ్గిపోయి.. ఆటోమేటిగ్గా సింగరేణి చచ్చిపోతుందని సీపీఐ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. 

దేశం మొత్తం కొత్త మైన్స్ ను ప్రైవేట్ వాళ్లకు అప్పజెబుతున్నారని సీపీఐ నారాయణ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో మోడీ పర్యటించినా.. విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ పోలీసులను ప్రధాని నరేంద్ర మోడీకి  అప్పగించారనే అనుమానం వస్తుందని నారాయణ ఆరోపించారు.