ఇప్పుడంతా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)’ హవా నడుస్తోంది. అన్ని రంగాల్లోనూ ‘ఏఐ’కి ప్రాధాన్యం ఉండబోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీలన్నీ ‘ఏఐ’తో అద్భుతాలు సృష్టించే పనిలో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ‘సామ్సంగ్’ కూడా ‘స్టార్ ల్యాబ్స్’ ఏర్పాటు చేసి, దీనిపై రీసెర్చ్ చేస్తోంది. తాజాగా ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్’ను సృష్టించింది. పేరు ‘నియోన్’. మంగళవారం ప్రారంభమైన ‘సీఈఎస్ 2020’ ఈవెంట్లో సామ్సంగ్ ఆరు నియోన్లను ప్రదర్శనకు ఉంచింది. ఇవి రెగ్యులర్గా వాడుతున్న అలెక్సా, గూగుల్ అసిస్టెంట్లాంటి కమర్షియల్ ‘ఏఐ’లకు భిన్నంగా ఉంటుందని ‘స్టార్ ల్యాబ్స్’ సీఈఓ ప్రణవ్ మిస్త్రీ చెప్పారు.
నియోన్స్ చాలా అంశాల్లో రియల్ మనుషుల్లాగానే బిహేవ్ చేస్తాయన్నారు. యోగా ఇన్స్ట్రక్టర్, బ్యాంకర్, పాప్ స్టార్, న్యూస్ యాంకర్, ఫ్యాషన్ మోడల్స్.. ఇలా వేర్వేరు రంగాలకు చెందిన వ్యక్తులు ఎలా నడుస్తారో, ఎలా బిహేవ్ చేస్తారో అలా ఈ నియోన్లు నడుచుకుంటాయని అన్నారు. ఈ నియోన్లు హిందీ, స్పానిష్, ఇంగ్లీష్, ఇతర భాషల్ని అర్థం చేసుకుని స్పందిస్తాయని వివరించారు.