ముంబై: జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్పై ఈడీ మనీలాండరింగ్ కేసు బుక్ చేసింది. ఆయనతో పాటు మరికొందరిపై ఈ కేసు దాఖలు చేసినట్టు ఈడీ ఆఫీసర్లు తెలిపారు. గోయల్కు చెందిన ఆస్తుల్లో, భవనాల్లోనూ తనిఖీలు చేసినట్టు అధికారులు చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ) కింద జెట్ ఎయిర్వేస్ మాజీ ఛైర్మన్పై క్రిమినల్ కేసు దాఖలు చేసినట్టు తెలిపారు. క్రిమినల్ కేసు దాఖలు చేసిన తర్వాత గోయల్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అంతేకాక ముంబైలోని గోయల్కు చెందిన ప్రాంతాల్లో రైడ్స్ చేపట్టారు.ఇటీవలే ముంబై పోలీసులు కూడా ఈయనకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో గోయల్, ఇతరులు కలిసి ముంబైకి చెందిన ఈ ట్రావెల్ కంపెనీలో మోసానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
గతంలోనూ దాడులు
గతేడాది సెప్టెంబర్లోనే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా) కింద కేసు నమోదు చేసిన ఈడీ అప్పటి నుంచి గోయల్పై ప్రశ్నలు వర్షం కురిపిస్తూనే ఉంది. ఫెమా కింద కూడా గోయల్, ఆయన కుటుంబ సభ్యుల నివాసాలపై ఈడీ రైడ్స్ చేసింది. గోయల్కు 19 ప్రైవేట్ కంపెనీలున్నాయి. వాటిలో ఐదు విదేశాల్లో రిజిస్టర్ అయ్యాయి. ఈ కంపెనీలకు అత్యధిక మొత్తంలో వెచ్చించినట్టు చూపించి, ఎక్కువ నష్టాలను చూపిస్తోందని ఈడీ అనుమానిస్తోంది. అంతేకాక మనుగడలో లేని ఆఫ్షోర్ సంస్థలకు (డొల్ల కంపెనీలు) ఈ ఎయిర్క్రాఫ్ట్ లీజ్ లావాదేవీలు జరిపినట్టు తెలిసింది. ఈ లావాదేవీలు కూడా ఈడీ విచారణలో ఉన్నాయి. డొల్ల కంపెనీలతో జెట్ లీజ్ రెంటల్స్ కుదుర్చుకున్నట్టు ఈడీ అనుమానిస్తోంది. ఇలా గోయల్ కంపెనీలకు అక్రమంగా మనీని తరలించినట్టు భావిస్తోంది. క్యాష్ లేక, గతేడాది ఏప్రిల్లో జెట్ ఎయిర్వేస్ మూతపడిన సంగతి తెలిసిందే. అంతకు నెల ముందే, జెట్ ఎయిర్వేస్ ఛైర్మన్గా గోయల్ తప్పుకున్నారు.