జెనీవా: కరోనా ఎక్కడ పుట్టిందో తేల్చాల్సిందేనని, ఈ మహమ్మారిపై పోరాటం విషయంలో చైనా వ్యవహరించిన తీరుపైనా విచారణ జరగాల్సిందేనని ఇండియా సహా 120 దేశాలు తీర్మానం చేశాయి. సోమవారం జెనీవాలో ప్రారంభమైన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ వో) 73వ అసెంబ్లీలో యూరోపియన్ యూనియన్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి ఆయా దేశాలు మద్దతు తెలిపాయి.
ఇండియా కూడా మద్దతు..
కరోనాపై విచారణ చేయాలన్న డిమాండ్కు ఇండియా మద్దతు తెలిపింది. వుహాన్ లో వైరస్ పుట్టుక, తర్వాత చైనా వ్యవహరించిన తీరుపై ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ మొదట అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు డిమాండ్ చేశాయి. డబ్ల్యూహెచ్ వో మీటింగ్ లో విచారణకు అనుకూలంగా.. ఇండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్, కెనడా, జపాన్, కజికిస్థాన్, మలేసియా, మాల్దీవ్స్, మెక్సికో, న్యూజీలాండ్, నార్వే, ఖతార్, సౌత్ కొరియా, రష్యా, సౌదీ అరేబియా, టర్కీ, యూకే, ఉక్రెయిన్, 50 ఆఫ్రికన్ కంట్రీస్ మద్దతు తెలిపినట్లు డబ్ల్యూహెచ్ వో లిస్టును విడుదల చేసింది. అన్ని దేశాల కంటే ముందే విచారణకు డిమాండ్ చేసిన అమెరికా పేరు మాత్రం లిస్టులో లేదు.
వీలైనంత త్వరలో విచారణ..
కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి, నియంత్రణపై వీలైనంత త్వరలో విచారణ చేపడతామని డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రియేసస్ వెల్లడించారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకూ కరోనాకు డబ్ల్యూహెచ్ వో రెస్పాన్స్ అయిన తీరుకు సంబంధించి ఓ ఇండిపెండెంట్ సంస్థ రూపొందించిన ఇంటరిమ్ రిపోర్ట్ కూడా ఈ సందర్భంగా విడుదలైంది. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్ వో వార్నింగ్ సిస్టం బాగానే ఉందని రిపోర్ట్ తెలిపింది. ట్రావెల్ అడ్వైస్తో డబ్ల్యూహెచ్ వో తీరును మాత్రం సభ్య దేశాలే రీఅసెస్ చేసుకోవాలని సూచించింది.
బాధ్యతతో వ్యవహరించాం: జిన్ పింగ్
డబ్ల్యూహెచ్ వో విచారణకు తాము సిద్ధమని చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్ వెల్లడించారు. డబ్ల్యూహెచ్ వో మీటింగ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా విషయంలో బాధ్యతతో వ్యవహరించామని, అన్ని విషయాలనూ బహిరంగంగా పంచుకున్నామని స్పష్టం చేశారు. కరోనాపై పోరాటం కోసం 200 కోట్ల డాలర్ల విరాళం ఇస్తామని ప్రకటించారు. గతంలో విచారణపై వ్యతిరేకత వ్యక్తం చేసిన చైనా..దేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఒప్పుకుంది.
హాంకాంగ్ పై హద్దులు మీరొద్దు: చైనాకు అమెరికా వార్నింగ్
హాంకాంగ్ అటానమీ, ఫ్రీడమ్పై చైనా హద్దులు మీరుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో హెచ్చరించారు. ‘ఒకేదేశం, రెండు వ్యవస్థలు’ అన్న సూత్రానికి ఇది విరుద్ధమన్నారు. చైనా హద్దులు మీరడం సరికాదని హెచ్చరించారు.
తొలిసారి వర్చువల్ గా..
డబ్ల్యూహెచ్ వో అసెంబ్లీ వర్చువల్ గా (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) జరగడం ఇదే మొదటిసారి. ఏటా ఈ సమావేశాలు 3 వారాలు జరుగుతాయి. కరోనా వల్ల రెండు రోజులకు కుదించారు. సమావేశంలో ఇండియా నుంచి హెల్త్ మినిస్టర్ హర్ష వర్ధన్ హాజరయ్యారు.