
- చలిని సైతం లెక్క చేయకుండా ఉదయం 7 గంటల నుంచే క్యూలో జనం
- వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలు
- 4వేలకు పైగా అప్లికేషన్లు
బేగంపేట, వెలుగు : హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి 4 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఉదయం 7 గంటలకే ప్రజాభవన్ వద్దకు చేరుకున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా క్యూలైన్లలో నిలబడ్డారు. అధికారులు వారిని ఉదయం 8 గంటల నుంచి లోపలకు అనుమతించారు.
శుక్రవారం వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం డబుల్ బెడ్రూం ఇండ్లు, భూ సమస్యలు, ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. ఎన్నో ఏండ్లుగా అన్ని ఆఫీసులకు తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదని కొందరు బాధితులు తెలిపారు. ముఖ్యమంత్రికి అర్జీ ఇచ్చేందుకు వచ్చామని, ఇక్కడ మంత్రులు కూడా లేరన్నారు. సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారి నుంచి ఫిర్యాదులను తీసుకునేందుకు ప్రతి మంగళవారం
శుక్రవారం సీఎం తరఫున ఎవరో ఒక మంత్రి ప్రజావాణికి హాజరు కావాలి. అయితే, శుక్రవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మంత్రులు ఎవరూ హాజరు కాలేదు. నోడల్ అధికారి దాసరి హరిచందన, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ మాత్రమే అర్జీలను తీసుకున్నారు.
కొవిడ్ సాయం ఇప్పటికీ అందలే
కరోనా టైమ్ లో నా తల్లి అనసూయ బాయీ వైరస్ బారిన పడి మృతి చెందింది. ప్రభుత్వం నుంచి రూ.లక్ష ఆర్థిక సాయంగా రావాల్సి ఉన్నా ఇంకా ఇవ్వలేదు.
– కె. హన్మంతరావు, ఎస్ఆర్ నగర్ రెగ్యులర్ చేయాలి
మెడికల్అండ్హెల్త్విభాగంలో 18 ఏండ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నా. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా సమస్యను పరిష్కరించాలి.
– స్వప్నా రెడ్డి, మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్
317 జీఓతో స్థానికత కోల్పోయాం
పశు సంవర్థక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు 317 జీవోతో స్థానికత కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2021లో తీసుకొచ్చిన జీఓతో సొంత జిల్లాల నుంచి 400 కి.మీ దూరం పోస్టింగ్ ఇచ్చారు. ఈ జీఓను రద్దయినా చేయాలి లేదా సవరణ అయినా చేయాలి.
– శ్రీనివాస్, వెటర్నరీ శాఖ ఉద్యోగి
హోంగార్డులను తిరిగి తీసుకోవాలి
ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంగా తొలగించిన 250 మంది హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మమ్మల్ని ఆంధ్రా అధికారులు కక్షగట్టి హఠాత్తుగా పోలీసు స్టేషన్లకు పిలిపించి విధుల నుంచి తొలగించారు.
బి.బురాన్గౌడ్, సమ్మయ్య నాయక్
ఉద్యమంలో కాళ్లు, చేతులు పోయినయ్..ఉద్యోగం ఇప్పించండి
తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 ఆగస్టులో రైల్ రోకోలో పాల్గొన్న. రైలుకు ఎదురెళ్లి రెండు కాళ్లు, ఎడమ చేయి పోగొట్టుకున్న. డిగ్రీ చదివిన నాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగం, సాగు చేసుకునేందుకు భూమి ఇస్తామని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు హామీ ఇచ్చారు. ఆర్థిక సాయంగా రూ.10 లక్షలు ఇచ్చారు. కానీ సోషల్ మీడియాలో రూ.70 లక్షలు, 3 ఎకరాల భూమి ఇచ్చినట్లు ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా నాకు ఉద్యోగం ఇవ్వాలి.
– పిడమర్తి నాగరాజు, రాయనిగూడెం, హుజూర్ నగర్
ఆరోగ్యశ్రీ మంజూరు చేయాలి
ఆరోగ్యశ్రీ లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నా. దివ్యాంగ పెన్షన్ మాత్రమే వస్తోంది. రేషన్ కార్డులో పేరు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు. ఆరోగ్య శ్రీ మంజూరయ్యేలా చూడాలి.
పి. ఆనంద్, బోడుప్పల్, దివ్యాంగుడు