దోమలకు డైట్ పిల్స్ ఇచ్చి మలేరియా, జికా, డెంగీ లాంటి వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చట. న్యూరో పెప్టైడ్ వై (ఎన్పీవై) లాంటి రిసెప్టర్లున్న మందులిస్తే అవి రక్తం తక్కువ తాగుతాయట. ఆడ దోమలకు ఈ ఎన్పీవై ఉన్న మందిస్తే ప్రాణాంతక వ్యాధులు సోకడం చాలా తగ్గుతుందని న్యూయార్క్లోని రాక్ ఫెల్లార్ వర్సిటీ సైంటిస్టులు చెప్పారు. ఈ ఎన్పీవై రిసెప్టర్లే వానపాము నుంచి మనుషుల వరకు ఆకలిని నియంత్రిస్తుంటాయన్నారు. ఎక్కువ ఆకలి కాకుండా ఇప్పటికే యాంటీ ఒబెసిటీ మందుల్లోనూ దీన్ని ట్రయల్ చేశారని చెప్పారు.
సాధారణంగా దోమలు వాటి బరువు కన్నా రెండింతల రక్తాన్ని పీల్చేస్తాయని, అలా తాగాక అదో రకం ఫుడ్ కోమాలోకి పోతాయని, కొన్ని రోజుల పాటు అలానే ఉండి రెస్ట్ తీసుకుంటాయని సైంటిస్టులు అంటున్నారు. బాగా రక్తం తాగిన దోమలున్న బోనులో చేయి పెట్టినా అవి కుట్టవని చెప్పారు. ఎక్కువ రక్తం తాగిన ఎడీస్ ఈజిప్టీ దోమలు మెల్లిగా దాన్ని జీర్ణం చేసుకుంటూ గుడ్లుగా మారుస్తాయన్నారు. దోమలు రక్తం తాగాక ఎన్పీవై యాక్టివ్ అవుతుందని, దాంతో వాటిల్లో ఆకలి తగ్గుందని గుర్తించారు. ఈ ఎన్పీవైనే దోమలకిస్తే ఎలా ప్రభావం చూపుతాయోనని పరిశోధన చేశామని, ఎన్పీవై బాగా పని చేసిందని, దోమలు రక్తం తీసుకోడానికి ఆసక్తి చూపించలేదని వెల్లడించారు. కాబట్టి న్యూరోపెప్టైడ్ వై ప్రోటీన్ ద్వారా దోమలు కుట్టకుండా చేయొచ్చన్నారు. ఈ ప్రోటీన్ పని తనం ఒక్కో జంతువులో ఒక్కోలా ఉంటుందని, మనుషుల్లో ఆకలి పెంచుతుందని, ఈగలు ఎగిరేందుకు సాయ పడుతుందని, కానీ దోమల్లో మాత్రం వ్యతిరేకంగా పని చేస్తుందని చెప్పారు. సంతానోత్పత్తినీ ఆలస్యం చేస్తుందని వివరించారు.
