
- కుటుంబ కలహాలతో సోమవారం పురుగుల మందు తాగిన తల్లి, ముగ్గురు కూతుళ్లు
- మరో ఇద్దరు కూతుళ్లకు కొనసాగుతున్న ట్రీట్మెంట్
కాగజ్నగర్, వెలుగు : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఓ మహిళ, ముగ్గురు కూతుళ్లతో కలిసి పురుగుల మందు తాగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ తల్లి, ఓ కూతురు చనిపోగా, మరో ఇద్దరు కూతుళ్లకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం గజ్జిగూడకు చెందిన చిలుకూరి అనిత (42) కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై నలుగురు కూతుళ్లు లక్ష్మి, రమ్య (16), ఐశ్వర్య, రవళిని వెంటబెట్టుకొని సోమవారం పొలం వద్దకు వెళ్లింది.
అక్కడ కూతుళ్లకు పురుగుల మందు ఇచ్చి తానూ తాగింది. అయితే రవళి పురుగుల మందు తాగకుండా పక్కనే ఉన్న కూలీలకు విషయం చెప్పింది. దీంతో వారు వచ్చి అనిత, లక్ష్మి, రమ్య, ఐశ్వర్యను కాగజ్నగర్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ బుధవారం ఉదయం అనిత చనిపోగా, రెండు గంటల వ్యవధిలోనే రమ్య కూడా చనిపోయింది.
లక్ష్మి, ఐశ్వర్య ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రాంబాబు, తహసీల్దార్ కిరణ్కుమార్ ఘటనాస్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.