వర్షాలకు గోడ కూలి తల్లీ కూతుళ్లు మృతి

వర్షాలకు గోడ కూలి తల్లీ కూతుళ్లు మృతి

రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని మలిశెట్టి గూడలో భారీ వర్షాలకు ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో తల్లీ, కూతుళ్లు ఇద్దరూ చనిపోయారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జనం ఎవరూ ఇళ్లలో నుండి బయటకు రాలేని పరిస్థితి ఉంది. గత ఆదివారం నుండి సూర్యుడు కనిపించకుండా ఎడతెరిపిలేన వాన కురుస్తోంది. అత్యవసరమైతే తప్ప జనం బయటకు రాలేని పరిస్థితి. నాలాలు పొంగి పారుతున్నాయి. రోడ్లపై ఎక్కడ చూసినా పొంగి పారుతున్న వాన నీరే కనిపిస్తోంది. పిడుగుల శబ్దాలకు అక్కడక్కడ భారీ చెట్లు కూలి రోడ్లపై అడ్డంగా పడిపోతుంటే మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిన్న మలిశెట్టిగూడలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఇంటి గోడ కూలి మీద పడడంతో తల్లీ కూతుళ్లు ఇద్దరూ తీవ్రంగా గాయపడి చనిపోయారు. ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదం రేపింది.