రోహింగ్యాలకు పాస్‌‌పోర్ట్‌లు ఇవ్వడం దేశద్రోహమే

రోహింగ్యాలకు పాస్‌‌పోర్ట్‌లు ఇవ్వడం దేశద్రోహమే

నిజామాబాద్: రోహింగ్యాలకు పాస్‌‌పోర్ట్‌‌లు ఇవ్వడం సిగ్గుచేటని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. జిల్లాలో దొంగ పాస్‌‌పోర్టుల వ్యవహారం హిందువులను కలవరపెడుతోందన్నారు. రోహింగ్యాల పాస్‌‌పోర్టుల వ్యవహారంలో సీపీ కార్తికేయ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హిందువులను ఇబ్బంది పెట్టడానికి సీపీ కార్తికేయ ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారని.. ఆయన సూచనల మేరకే హిందువులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ టీఆర్ఎస్-ఎంఐఎం ఏజెంట్ అని, ఆయన ప్రోద్భలంతోనే రోహింగ్యాలకు దొంగ పాస్‌‌పోర్టులు ఇచ్చారని పేర్కొన్నారు.

‘రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వడం చేతకాని ప్రభుత్వం.. రోహింగ్యాలకు దొంగ పాస్‌‌పోర్టులు మాత్రం ఇస్తోంది. ఈ ప్రభుత్వం ఎంఐఎంకు అమ్ముడుపోయింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జారీ అయిన ఆధార్ కార్డులపై విచారణ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌‌ను డిమాండ్ చేస్తున్నాం. రోహింగ్యాలకు పాస్‌‌పోర్టులు ఇవ్వడం దేశ ద్రోహం. కేసీఆర్ కుటుంబం హిందువులను అణగదొక్కుతోంది. కేసీఆర్ రాజకీయ జీవితాన్ని, టీఆర్ఎస్‌‌ను బొంద పెట్టేవరకు బీజేపీ నిద్రపోదు. పోలీస్ కమిషనర్ తీరుపై అమిత్ షాకు ఫిర్యాదు చేయనున్నాం. పోలీస్ కమిషనర్‌‌గా పని చేయడానికి కార్తికేయ అన్‌‌ఫిట్. ఆయన రాజీనామా చేసి వెళ్లిపోవాలి’ అని అర్వింద్ అన్నారు.

నడిరోడ్డుపై నరికేసినా స్పందించరా?
అడ్వకేట్ వామన్ రావ్ దంపతులను నడిరోడ్డుపై నరికినా ప్రభుత్వం స్పందించడం లేదని అర్వింద్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు వామన్ రావ్‌‌ను హత్య చేశారన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. అడ్వకేట్ దంపతుల హత్యలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.