హాత్ వే డిజిటల్ కేబుల్ మాజీ డైరెక్టర్ రాజశేఖర్ మృతిపై ఎంపీ బండి సంజయ్ స్పందించారు. హాత్ వే రాజశేఖర్ గా ఉమ్మడి రాష్ట్రంలో పేరు గాంచిన చెలికాని రాజశేఖర్ ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజశేఖర్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు సమాచారం. కేబుల్ టీవీ, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసు రంగంలో రాజశేఖర్ సుదీర్ఘ కాలంగా సేవలందించారు.
హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో హాత్ వే ను ప్రజలకు చేరువ చేయడంలో రాజశేఖర్ కీలకపాత్ర పోషించారని సంజయ్ అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం కోసం ఆయన చేసిన నిరంతర కృషి ఎనలేనిదని అన్నారు. ఆయన మరణం కేబుల్ రంగానికి తీరని లోటని అన్నారు.